రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా కొన్ని వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో స్థలాలను కేటాయించింది. తొమ్మిది జిల్లాల్లో 10 వ్యవసాయ మార్కెట్ యార్డుల ప్రాంగణాల్లో రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపులు, కొనుగోళ్లు చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 గుంటల భూమి కొనుగోలు చేసింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, జన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణాల్లో 20 గుంటలు చొప్పున కొనుగోలు చేసిన భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 5 గుంటలు, నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ యార్డులో 15 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.