తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2022, 12:44 PM IST

ETV Bharat / state

మాచర్ల ఘటనలో గాయపడిన వారి వైద్య నివేదికను సమర్పించండి: ఏపీ హైకోర్టు

HC ON TDP LEADERS BAIL PETITION: ఏపీలోని మాచర్ల దాడుల ఘటనలో గాయపడిన వారికి సంబంధించిన వైద్య నివేదికలను తమ ముందు ఉంచాలని.. పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు గురువారం ఆదేశాలిచ్చారు.

HIGH COURT ON MACHERLA INCIDENT
మాచర్ల ఘటనలో గాయపడిన వారి వైద్య నివేదికను సమర్పించండి హైకోర్టు

HIGH COURT ON MACHERLA INCIDENT: ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మాచర్ల దాడుల ఘటనలో గాయపడిన వారికి సంబంధించిన వైద్య నివేదికలను తమ ముందు ఉంచాలని పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) నాగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మాచర్ల పట్టణంలో చోటు చేసుకున్న దాడుల ఘటనలో తమపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేత, మాచర్ల నియోజకవర్గం ఇన్​ఛార్జ్ జూలకంటి బహ్మానందరెడ్డి, సహా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. నిందితులు 1,3,7పై తప్ప ఇతరుల విషయంలో నేరారోపణకు సంబంధించి సరైన ఆధారాలు లేవన్నారు. ప్రతిపక్షపార్టీకి చెందిన నేతలను వేధించాలని, భయభ్రాంతులకు గురిచేయాలన్న కారణంతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్ల ఇళ్ల పైనే అధికార పార్టీకి చెందిన నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. ఇళ్లు ధ్వంసం చేశారన్నారు. కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.

పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. మొదటి నిందితుడికి నేర చరిత్ర ఉందన్నారు. దాడులకు పాల్పడి అధికార పార్టీ కార్యకర్తలను గాయపరిచారన్నారు. బెయిల్​ ఇవ్వొద్దని.. ఇస్తే ఇలాంటి ఘటనలను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. బాధితుల గాయాలకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలన్నారు. వారికి తేలికపాటి గాయాలయ్యాయా, తీవ్ర గాయాలయ్యాయా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details