తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2021, 5:42 PM IST

Updated : Jun 26, 2021, 7:29 PM IST

ETV Bharat / state

CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం

CM
సీఎం

17:37 June 26

ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, ఆస్తులను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలి: సీఎం

పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్​ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణప్రగతి కార్యాచరణపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో అన్ని శాఖలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేయాలని... పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.

     జులై చివరికల్లా ప్రభుత్వ శాఖల మధ్య పేరుకుపోయిన  పరస్పర బకాయిలను 'బుక్ అడ్జస్ట్​మెంట్' ద్వారా పరిష్కరించాలని చెప్పారు. ఇక నుంచి అన్నిశాఖల మధ్య విధిగా చెల్లించాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాలని సీఎం తెలిపారు. భవిష్యత్ తరాలు పట్టణాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, ప్రతి పట్టణంలో కనీసం నాలుగు, ఐదు డంపు యార్డుల కోసం పట్టణాలకు  దగ్గర్లో స్థలాలను సేకరించి పెట్టుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.  

 కాస్మోపాలిటన్ నగరం...

    కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్ వేగంగా అభివృధ్ది చెందుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా, హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు, తాగునీరు, రహదార్లు, తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లను అనుమతించవద్దని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి... నూతన చట్టాల్లోని నిబంధనలను విధిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.  

     వలస కార్మికుల విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టర్​ కార్యాలయాలకు తరలుతున్న ప్రభుత్వ  కార్యాలయాల స్థలాలు, ఆస్తులను జిల్లా కలెక్టర్​ స్వాధీనం చేసుకోవాలని సీఎం చెప్పారు. ఆ స్థలాలను ప్రజా అవసరాల కోసం వినియోగించాలని సూచించారు.  

      వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను లక్ష జనాభాకు ఒకటి చొప్పున, మూడు ఎకరాల విస్తీర్ణానికి తక్కువ కాకుండా  నిర్మించాలన్న కేసీఆర్... మార్కెట్లలో పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పది రోజుల సమయాన్ని అధికారులు సమర్థంగా వినియోగించుకొని అన్నీ చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. మ్యాప్ యువర్ టౌన్ భావనతో ముందుకెళ్లాలని సూచించారు.

కలెక్టరేట్‌లో రాష్ట్ర ఛాంబర్‌...

ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఛాంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి కలెక్టరేట్‌ ప్రాంగణంలో జంట హెలిపాడ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జులై చివరి నాటికి ప్రభుత్వ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ శాఖల భూములు, ఆస్తుల వివరాల నమోదు కోసం ఎస్టేట్‌ ‌అధికారితో పాటు పర్యవేక్షణ కోసం జిల్లాకొక ఎస్టేట్ అధికారిని నియమించాలన్నారు.

ఎస్టేట్ అధికారులు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పని చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎస్టేట్ అధికారిని నియమించి... సీఎస్ పర్యవేక్షణలో విధులుంటాయని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి పనుల కోసం వివిధ స్థాయుల్లో నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రుల వద్ద రూ.2 కోట్లు, కలెక్టర్‌కు రూ.కోటి కేటాయింపు చేపట్టినట్లు సీఎం వివరించారు.

ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులూ వాడుకోవచ్చని తెలిపారు. స్థానిక జిల్లా మంత్రి నుంచి ఆమోదం తీసుకొని ఖర్చు చేయాలని సూచించారు. 

ఇదీ చదవండి: Webinar:ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి ఒడిగట్టారు

Last Updated : Jun 26, 2021, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details