కరోనా నేపథ్యంలో అన్ని రంగాల్లో పరిస్థితులు మారిపోయాయి. గ్రామీణ రంగాలు సైతం తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు కొరవడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర వృత్తిదారులు తమ కుటుంబాలతో కలిసి సొంత గ్రామాలబాట పడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సొంత గ్రామాలకు వెళ్లలేక... ఒకవేళ వెళ్లినా ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ భయంతో స్థానికుల నుంచి నిరసన, తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మళ్లీ నగరం, పట్టణాలబాట పడుతున్నారు.
కొలువు దేవుడెరుగు... కూలీ దిక్కులేదు...
నగరాల్లో ప్రైవేట్ సంస్థల్లో కొలువులు దేవుడు ఎరుగు... కనీసం బయట ఉపాధి, కూలీ పనుల అవకాశాలూ కానరాకుండా పోయాయి. ఫలితంగా ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విశ్వనగరం హైదరాబాద్ జంట నగరాల్లో అడ్డా కూలీల పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. రెక్కాడితే డొక్కాడని వేలాది మంది కార్మికులు బతుకుదెరువు కోసం ఏ పని దొరికితే అదే చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఎన్నో కుటుంబాలు రోడ్డున...
అయినప్పటికీ... పనులకు పిలిచే నాథుడే లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజూ ఉదయం 6 గంటలకు అడ్డాపైకి వచ్చి ఎవరు పిలుస్తారా అని గంటల కొద్దీ ఎదురు చూస్తుంటే ఒక్క కూలీ దొరికితే రూ.500-800 వరకు లభిస్తాయి. ఏ కూలీ లేకుంటే జీహెచ్ఎంసీ సరఫరా చేసే 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకుంటున్నామని అడ్డా కూలీలు వాపోతున్నారు.
ఉపాధి కోసం వెంపర్లాట...
లాక్డౌన్ ఆంక్షలు దశల వారీగా ఎత్తేస్తున్న క్రమంలో కూలీ, ఉపాధి అవకాశాల కోసం కూలీ చేసుకునే వెంపర్లాడాల్సిన దుస్థితి నెలకొంది. ఎటు వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడం, అధిక ధరలు వెచ్చించి ఆటోల్లో వెళ్లాల్సి వస్తుండటం, పేద కుటుంబాలు, కూలీలపై అదనపు భారం పడుతోంది. ఛౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం లభించినప్పటికీ ఇళ్ల అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, నల్లా బిల్లులు చెల్లించలేక అనేక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారు.
నగరంలోనే దుర్భర జీవితం..