భాగ్యనగరంలో కరోనా కేసుల విజృంభన కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొవిడ్-19 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా.. హైదరాబాద్లో మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. లాక్డౌన్ నిబంధనలు సడలింపులు ఇచ్చిన 5 రోజులుగా నగరంలో కేసుల తీవ్రత కూడా అతి వేగంగా పెరుగుతోంది. సాధారణ జన జీవనంలాగే అందరు రోడ్లపైకి రావడం.... దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వాణిజ్య కార్యకలపాలు సాగించే దగ్గర కరోనా నివారణ చర్యలు ఏ మాత్రం పాటించడం లేదు.
జరిమానా విధించిన మార్పు రావడం లేదు...
చాలామంది నగరవాసులు మాస్కులు, శానిటైజర్లు వినియోగించడం లేదు. భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కేసుల తీవ్రతకు కారణం అవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. మాస్కులు పెట్టుకోని వారికి జరిమనా విధిస్తున్నా... కొంత మందికి అవగాహన లేకపోవడం అవరోధంగా మారింది. మాంసం విక్రయించే వారి నుంచే కేసులు రావడం వల్ల అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. జన సమర్ధ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మాంసం వ్యాపారికి కరోనా...
నగరంలోని బోరబండ బంజారానగర్లో మాంసం దుకాణం నిర్వాహకునికి కరోనా సోకినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వెంటనే ఆయన 8 మంది కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్కు తరలించారు. దుకాణంలో మాంసం కొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
సనత్ నగర్ అశోక్ కాలనీలోని మరో 25 ఏళ్ల యువకునికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ యువకుడు గత రెండేళ్ల నుంచి ఇంట్లోనే ఉంటు బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతూ జౌషధాలను వాడుతున్నాడు. మూడు రోజుల క్రితం సాధరణ చెకప్కి వెళ్లిన ఈ యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల పాజిటివ్ వచ్చింది. యువకుని సోదరులు బయట తిరిగి రావడం వల్ల.. వారి నుంచి వైరస్ రావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మిగతా కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచిన బల్దియా అధికారులు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 38 మందికి సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెండోరోజుల క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే అధికారికి పాజిటివ్ రావడం వల్ల వీరందరికి పరీక్షలు నిర్వహించారు.
భోలక్పూర్పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి...
సికింద్రాబాద్లోని భోలక్పూర్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం వల్ల జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో స్థానిక అధికారులతో సమావేశయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. భోలక్పూర్ ప్రాంతంలో ప్రత్యేకంగా రసాయనాలు చల్లించి... ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.
కేసులు నమోదవుతున్న చోట కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసి... పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రేటర్ పరిధిలో కొత్తగా వచ్చిన కేసుల వద్ద కంటైన్మెంట్లు, హౌస్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంటు వాసులు, కరోనా వచ్చిన ఇళ్ల వారు బయటికి రాకుండా ఉండడం కోసం కంచెలు వేసి గేట్లకు తాళాలు కూడా వేస్తున్నారు.