CWC elections 2023 : ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికైన తరువాత పూర్తి స్థాయిలో జాతీయ కార్యవర్గం ఏర్పాటుతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కూడా పూర్తి చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు రాయ్పూర్లో జరగనున్న 85వ ప్లీనరీ సమావేశంలో ఈ ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి చేయనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. అందులో 11 మంది సభ్యులను నామినేట్ చేయనుండగా, మరో 12 మంది సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
Congress85th Plenary Session : అయితే మొత్తం సీడబ్ల్యుసీ సభ్యుల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, యువత తదితర వర్గాలకు సగం రిజర్వేషన్లను వర్తింపచేస్తారు. మిగిలిన సగం మంది జనరల్ కోటా కింద ఎంపిక కావాల్సి ఉంది. సీడబ్ల్యుసీ సభ్యుల ఎంపికలో 1338 మంది ఏఐసీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎంపిక ప్రక్రియ ఈ నెల 26వ తేదీన జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్లీనరీలో మాత్రం ఏఐసీసీ సభ్యులతోపాటు 9,915 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మరో 3000 మంది నామినేటెడ్ సభ్యులు మొత్తం కలిసి దాదాపు 15వేల మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రం నుంచి ఎవరు పోటీ చేస్తారు: సీడబ్ల్యుసీ సభ్యులుగా ఎంపిక అయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు సీనియర్ నాయకులు పోటీ పడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవిలు పోటీ పడాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల బరిలోకి దిగే ముందు వీరు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చర్చించి వారి మద్దతుతోనే బరిలో దిగుతారని చెబుతున్నారు.