తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2020, 9:24 AM IST

ETV Bharat / state

వివాహ బంధం బురిడీలమయం.. ఆన్​లైన్​లో​ మోసాలు

హైదరాబాద్‌ మహానగరంలో పెళ్లిపేరిట మోసపోతున్న వారు పెరుగుతున్నారు. వివాహ పరిచయ వేదికలు, స్నేహాలు, మధ్యవర్తుల ద్వారా ఏటా 20-25 శాతం మంది వంచనకు గురవుతున్నారు. నగరానికి చెందిన ఓ వివాహ పరిచయ వేదిక సంస్థ నిర్వహించిన సర్వేలో దీన్ని గుర్తించారు.

cheating cases in online marriage proposals are increasing gradually in hyderabad
వివాహ బంధం.. బురిడీలమయం

సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న వివాహాల్లో మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విడాకులు, మనస్పర్థలు, అనారోగ్యం, ప్రమాదాలతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిలో కొందరు రెండో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. సామాజిక మాధ్యమాలు, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు, వివాహ పరిచయ వేదికలు, దళారులను ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి వారి నిస్సహాయతను అవకాశం చేసుకుని మాయగాళ్లు చెలరేగుతున్నారు. ఇటీవల ఓ మహిళ వివాహ ముసుగులో రూ.60 లక్షలు స్వాహా చేయటం సంచలనంగా మారింది.

ఆస్తిపాస్తులున్న, వితంతు/విడాకులు తీసుకున్న మహిళకు తగిన వరుడు కావాలంటూ ప్రకటనలు ఇచ్చి..వివాహ పరిచయ వేదికల ద్వారా సేకరించిన వ్యక్తిగత వివరాలతో పలుకరింపులు ప్రారంభిస్తారు. నగరంలోని కొన్ని ముఠాలు కాల్‌సెంటర్ల ద్వారా వ్యవహారం చక్కబెడుతున్నాయి. అక్కడ పనిచేసే మహిళలు/యువతులను వధువులుగా పరిచయం చేస్తున్నారు. హోటల్స్‌, కాఫీక్లబ్స్‌, పార్కుల్లో ఇద్దరినీ కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగే సమయంలో యువతికి అబ్బాయి ప్రవర్తన, ఉద్యోగం నచ్చలేదని సాకులు చెబుతూ మరో సంబంధం కోసం అదనపు రుసుం వసూలు చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడిన పరిచయాలను అవకాశంగా మలచుకుంటున్న ముఠాలు పెరిగాయి. ఈ తరహా మోసాలకు దిగుతున్నవారిలో స్థానికులు, నైజీరియన్లు ఉంటున్నారు. తేలికగా డబ్బు సంపాదించాలనే అవతలి వారి ఆశ మాయగాళ్లకు పెట్టుబడి. విదేశీ పెళ్లి పేరిట జరిగే మోసాల్లో సైబర్‌ నేరస్థులు ఎక్కువ. ఆర్థిక లావాదేవీలు జరిపేటపుడు అప్రమత్తత ముఖ్యం.

- వి.ఎం.ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్‌ హైదరాబాద్

ABOUT THE AUTHOR

...view details