సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న వివాహాల్లో మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విడాకులు, మనస్పర్థలు, అనారోగ్యం, ప్రమాదాలతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిలో కొందరు రెండో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. సామాజిక మాధ్యమాలు, మ్యాట్రిమోనీ వెబ్సైట్లు, వివాహ పరిచయ వేదికలు, దళారులను ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి వారి నిస్సహాయతను అవకాశం చేసుకుని మాయగాళ్లు చెలరేగుతున్నారు. ఇటీవల ఓ మహిళ వివాహ ముసుగులో రూ.60 లక్షలు స్వాహా చేయటం సంచలనంగా మారింది.
ఆస్తిపాస్తులున్న, వితంతు/విడాకులు తీసుకున్న మహిళకు తగిన వరుడు కావాలంటూ ప్రకటనలు ఇచ్చి..వివాహ పరిచయ వేదికల ద్వారా సేకరించిన వ్యక్తిగత వివరాలతో పలుకరింపులు ప్రారంభిస్తారు. నగరంలోని కొన్ని ముఠాలు కాల్సెంటర్ల ద్వారా వ్యవహారం చక్కబెడుతున్నాయి. అక్కడ పనిచేసే మహిళలు/యువతులను వధువులుగా పరిచయం చేస్తున్నారు. హోటల్స్, కాఫీక్లబ్స్, పార్కుల్లో ఇద్దరినీ కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగే సమయంలో యువతికి అబ్బాయి ప్రవర్తన, ఉద్యోగం నచ్చలేదని సాకులు చెబుతూ మరో సంబంధం కోసం అదనపు రుసుం వసూలు చేస్తున్నారు.