తెలంగాణ

telangana

కమిటీలతో గులాబీ తోటలో కమలం వికసించేనా?

By

Published : Dec 21, 2019, 5:19 AM IST

తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ఆ పార్టీ జాతీయ నాయకత్వం పదేపదే చెబుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు ఏం చేయబోతున్నారు? ఆపరేషన్‌ తెలంగాణతో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? కాషాయ దళం కొత్త కమిటీ రంగంలోకి దిగుతోందా? ఆ కమిటీలో ఎవరెవరికి బాధ్యతలు దక్కనున్నాయని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Bjp leaders to plan win the elections in telangana
కమిటీలతో గులాబీ తోటలో కమలం వికసించేనా?

కమిటీలతో గులాబీ తోటలో కమలం వికసించేనా?

తెలంగాణలో భాజపాకు త్వరలో కొత్త హంగులు రానున్నాయి. అధ్యక్ష పీఠంతో పాటు కార్యనిర్వహక అధ్యక్షుడి నియామకం జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడి లక్ష్మణ్‌ పదవీ కాలం ముగియగా... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం నియమించనుంది. ఈసారి హైదరాబాద్​కు చెందిన నేతలకు కాకుండా ఉత్తర, దక్షిణ తెలంగాణ నేతలకు అవకాశం కల్పించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతకు..

ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కృష్ణదాస్‌ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. అధిష్ఠానం పక్కా ప్రణాళికతో ఇద్దరు నేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఉత్తర, దక్షిణ తెలంగాణలో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకుల్లో ఒకరికి అధ్యక్షుడిగా, మరొకరిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

కార్యనిర్వాహక అధ్యక్ష పదవి..?

పార్టీ ఆవిర్భావం నుంచి భాజపాలో కార్యనిర్వహక అధ్యక్ష పదవి లేదు. తొలిసారిగా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడిగా జేపీ నడ్డాను నియమించారు. ఇదే విధానాన్ని రాష్ట్రాల్లోనూ పాటించాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఈసారి కొత్తగా ఈ పదవిని తెరపైకి తేవడం వల్ల రెండు బలమైన వర్గాలకు పదవులను కట్టబెట్టి పార్టీని జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.

ఆపరేషన్‌ తెలంగాణ..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి అధిష్ఠానమే నేరుగా ఆపరేషన్‌ తెలంగాణ చేపట్టింది. సంఘ పరివార్‌ శక్తులు కూడా కింది స్థాయిలో పనిని ప్రారంభించాయి. జనం బలం లేని నేతలకు ఈసారి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించవద్దని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇన్నాళ్లు పార్టీ కార్యాలయంలోనే తిష్టవేసిన కొందరు నేతలకు ఈసారి ఇబ్బందులు తప్పేట్లు లేవు.

అధ్యక్ష పదవికి ముఖ్య నేతల పోటీ..

రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కించుకునేందుకు పలువురు నేతలు జాతీయ నాయకత్వానికి తమ దరఖాస్తులను సమర్పించారు. అధ్యక్ష పదవి పొడగించాలని.. ఆ పార్టీ నేత లక్ష్మణ్‌ ఇప్పటికే అధిష్ఠానాన్ని కోరారు. తాను అధ్యక్షుడైన తరవాత రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నలుగురు ఎంపీల గెలుపు వంటివి అధిష్ఠానం దృష్టికి తీసుకువచ్చాడు. లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, బండి సంజయ్‌, జితేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో పాటు చాలా మంది అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.

కమల వికాసం సాధ్యమయ్యేనా...?

పార్టీ నాయకత్వం మాత్రం మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నేతలకు అవకాశమివ్వాలని యోచిస్తోంది. అధ్యక్ష, కార్యనిర్వహాక అధ్యక్ష పదవిలాంటి కొత్త ఫార్మూలాతో నూతన సంవత్సరం ఆరంభంలోనే కొత్త కమిటీని రంగంలోకి దింపాలని భావిస్తోంది. గులాబీ తోటలో కమల వికాసానికి భాజపా జాతీయ నాయకత్వం తీసుకోబోతున్న వ్యూహాలు సఫలీకృతమవుతాయో లేదో వేచి చూడాలి.

ఇవీ చూడండి: 'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'

ABOUT THE AUTHOR

...view details