నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించడం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు. వారు చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. వారు చూపించిన తెగువ ధైర్యసాహసాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఏ ప్రాంత ప్రజల కైనా వారి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం వారి జన్మహక్కు కాదనడానికి ఈ ముఖ్యమంత్రి ఎవరని బండి సంజయ్ ప్రశ్నించారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరుపడం లేదని ఆంధ్రా పాలకులను ప్రశ్నించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆరేళ్ల అవుతున్న అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బ తీయటం దారుణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆనాటి నిజాం సంస్థానంలో భాగమైన కొన్ని జిల్లాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిన రోజును అక్కడి ప్రభుత్వాలు వైభవంగా ఉత్సవాలు జరుపుతుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఫాం హౌస్లో పడుకోవడం మన దురదృష్టకరమన్నారు.