ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వీధిబాలలు, వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేస్తున్న చిన్నారులను పోలీస్శాఖ గుర్తించిందని ఆ రాష్ట్ర డీజీపి గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 25,298 మంది చిన్నారులను గుర్తించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. జనవరి, జులై, అక్టోబర్ నెలలో ఆపరేషన్స్ నిర్వహించామన్న డీజీపీ.. 7 రోజుల్లో 16,457 మంది పిల్లలను కాపాడామన్నారు.
చిన్న పిల్లల చేత.. పని చేయించుకోవడం చట్టరీత్యా నేరమని గౌతం సవాంగ్ హెచ్చరించారు. పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. చిన్నపిల్లల భవిష్యత్ సమాజానికి అవసరమన్నారు. చిన్నారులను రెస్క్యూ చేసి వదిలేయడమే కాకుండా.. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.