ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2022 జూన్కల్లా లైనింగ్తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021 డిసెంబర్కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
'ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు' అలసత్వానికి తావొద్దు..
పోలవరం ఆర్అండ్ఆర్పై జగన్ సమీక్ష నిర్వహించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాల నుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీ సీఎంకు అధికారులు వివరించారు. గతంలో ఆర్అండ్ఆర్ పనులపై దృష్టి పెట్టలేదని, ఆర్అండ్ఆర్ పనులను పూర్తిగా వదిలేశారని ఏపీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. పోలవరం ఆర్అండ్ఆర్ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని జగన్ తేల్చిచెప్పారు. ఏదో కట్టాం కదా? అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దని స్పష్టం చేశారు. కచ్చితంగా నాణ్యత ఉండాలన్న ఆయన ఇంతపెద్ద ఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు సహజంగానే ఎక్కడోచోట అలసత్వం కనిపించే అవకాశాలు ఉంటాయని.. అలసత్వానికి తావు ఉండకూడదని అధికారులకు సూచించారు. ఆర్అండ్ఆర్ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు.
ఖర్చు ఎక్కువైనా సరే.. నాణ్యత తప్పనిసరి
వేగంగా నిర్మించాలని, లక్ష్యాలను త్వరగా చేరుకోవాలన్న ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా జరగాలన్నారు. కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టినా సరే, నాణ్యత మాత్రం తప్పకుండా పాటించాలన్నారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అధికారులకు వివరించారు. కాలనీల నిర్మాణంతోపాటు.. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని దిశానిర్దేశం చేశారు. రోడ్లు, సామాజిక అభివృద్ధి పనులను స్థిరంగా ముందుకు చేసుకుంటూ వెళ్లాలన్నారు. ఆగస్టులో కొన్ని ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. వరద ఉంటే కనుక అది మళ్లీ తగ్గేసరికి నవంబరు, డిసెంబరు పట్టే అవకాశం ఉందన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఈ కాలనీలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈలోగా నిర్వాసితులకు ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఆర్అండ్ఆర్కు సంబంధించి బిల్లులు ఎక్కడా పెండింగులో పెట్టడం లేదని వెల్లడించారు. ఇకపై కూడా ఆర్అండ్ఆర్ బిల్లులను పెండింగులో పెట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
నిధులు వచ్చేలా చూడండి..
ఆర్అండ్ఆర్ పనులను వేగంగా చేసుకుంటూ ముందుకుపోవాలని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా రూ.2200 కోట్లు రావాల్సి ఉన్నా, పనులకు ఎక్కడా ఆటంకం రాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఇస్తోందని తెలిపారు. సుమారు 6 నెలలుగా ఈ బిల్లులు పెండింగులో ఉన్నాయని అధికారులు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో వచ్చేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. కేంద్రం నుంచి బిల్లుల మంజూరుకు సంబంధించి ఒక అధికారిని దిల్లీలో ఉంచాలని చెప్పారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక అధికారిని పెట్టామని అధికారులు జగన్కు తెలిపారు.
వచ్చే నెల ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శిస్తానని జగన్ వెల్లడించారు. నిర్వాసితులకు జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టి పెట్టామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్వాసితుల్లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారికి తిరిగి భూములు ఇచ్చేందుకు భూమిని గుర్తించాలని సూచించారు. చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా.. పనులు వేగంగా ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకు వచ్చేలా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:Chalo Thadepalli: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి.. భారీ బందోబస్తు