తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ సీత అడవులకెళితే.. ఈ బేబీ చీకటిలో మగ్గింది!

భర్త అంటే భరించేవాడు అంటారు. చివరి వరకు తోడుండే స్నేహితుడంటారు. కానీ ఓ భర్త వృద్ధాప్యంలో తన భార్యను ఒంటరి చేసి ఎటో వెళ్లిపోయాడు. ఆ ముసలావిడను ఇంట్లో ఉంచి తాళం వేసి కనిపించకుండా పోయాడు. విద్యుత్​ లేని ఇంట్లో 8 నెలల పాటు ఆ వృద్ధురాలు బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా గడిపింది. 72 ఏళ్ల వయసులో ఆమెలా అవస్థలు పడింది.. చివరికి ఏమైంది!?

By

Published : Feb 27, 2020, 7:58 PM IST

Updated : Feb 27, 2020, 9:20 PM IST

an-old-woman-living-alone-in-a-locked-house-in-hyderabad
ఆ సీత అడవులకెళితే.. ఈ బేబీ చీకటిలో మగ్గింది!

8 నెలలు చీకట్లో ఉన్న బేబమ్మ

ఓ పెద్దాయన అతి జాగ్రత్త 72 ఏళ్ల తన భార్యకు శాపంగా మారింది. 8 నెలలు చీకటి గదిలో గడపాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాకు చెందిన గంగాధర్​, బేబి దంపతులు. గంగాధర్​ నాగాయలంకలో వీఆర్వోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరికి సంతానం లేరు. ఇద్దరూ కలిసి హైదరాబాద్​ వచ్చారు. గణేశ్​నగర్​లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏడాదిన్నర తర్వాత గంగాధర్​కు ఏమనిపించిందో ఏమో.. భార్యపై అతిప్రేమతో ఎక్కడికి వెళ్లినా బేబమ్మను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లేవాడు.

భర్తమాట తప్పేది లేదు

ఓ రోజు బేబమ్మను ఇంట్లోనే ఉంచి తాళం వేసి సొంతూరు వెళ్లాడు. అద్దె డబ్బులు తీసుకొస్తానని చెప్పాడు. ఎనిమిది నెలలైనా తిరిగిరాలేదు. తాళం వేసిన ఇంట్లోనే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది బేబమ్మ. గదిలో విద్యుత్ లేదు. ఉన్న దుస్తులనే ఓపిక చేసుకొని ఉతుక్కొని వాడుకుంటోంది. ఆమె కష్టాలను చూడలేక ఇంటి యజమానురాలు శారదతోపాటు అదే ఇంట్లో అద్దెకున్న వాళ్లు కిటికిలో నుంచి ఆహారాన్ని అందిస్తున్నారు. తాళం పగలు గొడతామని, బయటికి రావాలని ఆమెను ఇంటి యజమానురాలు కోరేది. కానీ ఆమె మాత్రం భర్తమాట తప్పేది లేదని, తాను బయటకు రానని చెప్పేది.

వృద్ధాశ్రమానికి తరలింపు

బేబమ్మ వ్యథపై ఈనాడు కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ముషీరాబాద్ పోలీసులు, సిటీ సివిల్ కోర్టు జడ్జి వెంకటేశ్, హెల్పేజ్ ఇండియా సంస్థ ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్.. బేబమ్మ అద్దె ఇంటికి చేరుకున్నారు. ఇంటి యజమానురాలు, ఇరుగుపొరుగును విచారించారు. భర్త గంగాధర్​తోపాటు అతని సన్నిహితులను ఫోన్​లో సంప్రదించే ప్రయత్నం చేశారు. అనంతరం బేబమ్మను బుజ్జగించి సమీపంలోని ఓ వృద్ధాశ్రమానికి తరలించారు.

అందుబాటులో లేని భర్త

బేబమ్మ పరిస్థితిపై ఈనాడు, ఈటీవీ భారత్ ఆమె భర్త గంగాధర్​తో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అతని సన్నిహితులు శేషగిరిరావు స్పందించారు. గంగాధర్ రావు వదిలేసి వచ్చినమాట వాస్తవమేనని, అయితే భూముల విక్రయాల్లో ఆలస్యం కారణంగానే ఆయన ఊళ్లో ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు. త్వరలోనే బేబమ్మను తీసుకెళ్తారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఆ వాట్సాప్​ గ్రూపుల్లోనే దిల్లీ అల్లర్లకు స్కెచ్

Last Updated : Feb 27, 2020, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details