భాగ్యనగరంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం.. చాలామంది కొవిడ్-19ను స్వయంగా ఆహ్వానించడమేనని వైద్యులు చెప్తున్నారు. శనివారం మాదన్నపేటలోని ఓ అపార్ట్మెంట్లో సామూహికంగా కరోనా నిర్ధారణ అయింది. నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకింది.
మంగళ్హాట్లో శుక్రవారం ఒకే భవనంలో ఉంటున్న 15 మందికి కొవిడ్ సోకింది. ఈ భవనంలో ఉంటున్న కుటుంబాలందరికీ కలిపి ఒకటే బాత్రూం ఉండటం ఇందుకు కారణం. అందరికీ ఒకే బాత్రూం ప్రమాదకరమని తెలిసినా వారికి వేరే దారి లేదు. మలక్పేట గంజ్లో తొలుత ఒక వ్యాపారికి కరోనా సోకగా అతని నుంచి కుటుంబంలోని 20 మందికి వ్యాపించింది. మరో 160 మంది క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే ఆ కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.