భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన చోటియా దుర్గాప్రసాద్ తండ్రి రమేశ్ వర్మ వయసు 60 సంవత్సరాలు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఇంటినుంచి తప్పిపోయాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో తలెత్తిన చిన్నగొడవతో మనస్తాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గతంలో రెండుసార్లు ఇలాగే ఇంటి నుంచి వెళ్లిపోయిన దుర్గాప్రసాద్ ఇంటికి తిరిగొచ్చాడు. మూడోసారి వెళ్లినప్పుడు కూడా తిరిగి వస్తాడనుకున్నారు. కానీ దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా దుర్గాప్రసాద్ ఇంటికి చేరలేదు. కొన్నేళ్లపాటు అతని కోసం తిరిగిన కుటుంబసభ్యులు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైతం ఏళ్ల తరబడి ఆయన కోసం వెతికారు. అయినా లాభం లేదు. నేటికీ దుర్గాప్రసాద్ ఇంటికి చేరలేదు. అసలు ఉన్నాడో లేడో కూడా కుటుంబీలకు అంతుచిక్కని ప్రశ్నే. ఇల్లందు పోలీస్స్టేషన్లో ఈ అదృశ్యం కేసు (Missing Case) ఇంకా పెండింగ్లోనే ఉంది.
ఏళ్లు గడిచినా వీడని మిస్టరీ...
ఈ ఒక్కటే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది కేసుల మిస్టరీ ఏళ్లుగా వీడటం లేదు. 2020 నుంచి 2021 జూలై వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,310 అదృశ్యం కేసులు నమోదు కాగా.. 1,113 కేసులను పోలీసులు చేధించారు. మరో 197 అదృశ్యం కేసుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఏళ్లుగా వివిధ కారణాలతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులకు తీరని వేదన మిగిలిస్తోంది. తమ వారి జాడ ఏమైనా దొరికిందో తెలుసుకునేందుకు నిత్యం పోలీస్ స్టేషన్ల చుట్టూ కుటుంబసభ్యులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నా... అదృశ్య కేసుల చేధనలో పోలీసులు తాత్సారం చేస్తున్నారన్న భావన బాధితుల్లో వ్యక్తమవుతోంది.
కేసులే..జాడెక్కడ?
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని అదృశ్యం కేసులు పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ వారు తిరిగి ఇల్లు చేరలేదని కొందరు, మానసిక స్థితి బాగోలేక ఇంటిపెద్ద తప్పిపోయాడని ఇంకొందరు, భార్య చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని మరికొందరు, కొడుకు అదృశ్యమయ్యాడని తండ్రి, కూతురు కిడ్నాప్కు గురైందని మరో తల్లి, తమ బిడ్డకు మాయమాటలు చెప్పి ఎవరో తీసుకెళ్లారని ఇంకొకరు ఇలా అనేక రకాల కారణాలతో అదృశ్యమైన కేసులు ఉమ్మడి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఏళ్లుగా పెండింగ్ కేసులుగానే మిగిలిపోతున్నాయి.
అసలు ఉన్నారో లేదో?
తాము అన్ని చోట్ల తిరిగినా ఫలితం లేక పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబాల వేదనకు ఏళ్లుగా పరిష్కారం దొరకడం లేదు. తమవారు ఎక్కడున్నారో అసలు ఉన్నారో లేరో కనీస జాడ తెలియక బరువెక్కిన హృదయాలతో నిత్యం ఠాణాల చుట్టూ తిరుగుతున్న బాధిత కుటుంబాల్లో నిరాశ నిస్పృహలు ఆవహిస్తున్నాయి. ఉభయ జిల్లాల్లోని చాలా పోలీస్ ఠాణాల్లో బాధితులు ఇచ్చిన రకరకాల ఫిర్యాదులకు పరిష్కార మోక్షం మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందిస్తున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఆ తర్వాత మాత్రం పోలీసుల కదలికల్లో వేగం తగ్గుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత వేగంగా అదృశ్య, కిడ్నాప్ కేసుల్లో ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారని బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
పురోగతి లేని కేసులు..
నిత్యం పేరుకుపోతున్న వివిధ రకాల కేసులు, న్యాయం కోసం తమ వద్దకు వచ్చిన బాధితులతో మాట్లాడి పరిష్కారం చేయడం వంటి వాటితోనే సమయం గడిచిపోతుంది. ఇదే శ్రద్ధ మాత్రం అదృశ్యం కేసుల విషయంలో చూపడం లేదన్న భావన ఫిర్యాదుదారుల్లో వ్యక్తమవుతోంది. చిన్నారులు, యువతీయువకులు, పెద్దవాళ్లు కనిపించకుండా పోయిన కేసుల్లోనూ పురోగతి లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో తాత్సారం ఎక్కువగా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2020, 2021 ఏడాదిలో జూలై నాటికి ఖమ్మం జిల్లాలో 97 అదృశ్యం కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడంలోనైతే పరిష్కారానికి నోచుకోని అదృశ్యం కేసుల సంఖ్య 100కు చేరింది. రెండేళ్లలో ఉమ్మడి జిల్లాలో కలిపి మొత్తం 197 కేసుల్లో పోలీసులు ఆచూకీ కనుక్కోలేకపోయారు. వీరిలో మహిళలు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత పురుషులు ఉన్నారు. బాలబాలికల కేసుల్లోనూ పురోగతి లేకుండా పోయింది.