కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాదిలో నిర్వహించినట్లుగానే పరిమిత సంఖ్యలోనే కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ వేడుకను జరుపుతామని స్పష్టం చేశారు. స్వామివారి ఆలయంలోనే శ్రీరామనవమి వేడుకలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తామన్నారు.
ఎవరూ రావొద్దు..
మహమ్మారి దృష్ట్యా భక్తులు ఎవరూ శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తగా ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని... భక్తులు అర్థం చేసుకొని సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి వేడుకలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించాలని కోరారు.