Asian Games 2023 Kabaddi Controversy :ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు సెంచరీని దాటేసింది. అయితే అందులో పురుషుల కబడ్డీ విభాగంలో గోల్డ్ మెడల్ కూడా ఉంది. ఇరాన్తో జరిగిన తుది పోరులో భారత్ 33-29 తేడాతో (IND vs IRN Kabaddi) విజయం సాధించి గోల్డ్ను సొంతం చేసుకుంది. అయితే ఇరు జట్ల మధ్య మరొక నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో.. తీవ్రమైన హైడ్రామా జరిగింది. పాయింట్ల వద్ద ప్లేయర్స్ పట్టుపట్టడం వల్ల ఆటను దాదాపు గంటపాటు సస్పెండ్ చేశారు. చివరికి సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత భారత్ను విజేతగా అనౌన్స్ చేశారు.
వివాదం ప్రారంభమైంది ఇలా.. భారత్ - ఇరాన్ ప్లేయర్స్ మొదటి నుంచి పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించి ఆడారు. అయితే మ్యాచ్ ముగియడానికి మరొక 65 సెకన్ల సమయం మాత్రమే ఉందన్న సమయంలో.. భారత్ నుంచి కెప్టెన్ పవన్ రైడ్కు వెళ్లాడు. డూ ఆర్ డై అనే పరిస్థితి ఇది. అయితే పవన్ మాత్రం ప్రత్యర్థి ప్లేయర్లను టచ్ చేయకుండా లాబీ మీదకు వెళ్లాడు. అతడిని ఆపేందుకు ఇరాన్కు చెందిన నలుగురు డిఫెండర్లు కూడా వెళ్లిపోయారు.
దీంతో లాబీ మీదకు ఇరాన్ ప్లేయర్స్ వచ్చినందుకు తమకు పాయింట్లు ఇవ్వాలని భారత్.. ఎవరినీ టచ్ చేయకుండా పవనే లాబీపైకి వెళ్లినందుకు అతడిని ఔట్గా ప్రకటించాలని ఇరాన్.. డిమాండ్ చేశారు. దీంతో అధికారులకు ఓ సంకట పరిస్థితి ఎదురైంది. భారత్ ప్లేయర్స్ పాత రూల్స్ ప్రకారమే పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేయగా.. ఇరాన్ మాత్రం కొత్త రూల్స్ ప్రకారం తమకు పాయింట్ ఇవ్వాలని పేర్కొంది. ఇరు జట్ల ఆటగాళ్లు వాదోపవాదాలు చేసుకుంటూ మైదానంలోని మ్యాట్పైనే కూర్చొండిపోయారు.
అసలు రూల్స్ ఏం చెబుతున్నాయ్.. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ రూల్ బుక్ ప్రకారం.. డిఫెండర్ లేదా డిఫెండర్లు ఎవరూ కూడా లాబీ మీదకు రైడర్ను తాకకుండా వెళ్లకూడదు. వెళ్తే ప్రత్యర్థికి పాయింట్లు వస్తాయి. అలాగే లాబీ మీద రైడర్ను పట్టుకున్నాసరే అతడిని నాటౌట్గా పరిగణిస్తారు. ఒకవేళ రైడర్... డిఫెండర్లలో ఎవరినీ టచ్ చేయకుండా ఆ లాబీ మీదకు వెళ్తే సెల్ఫ్ఔట్ అవుతాడు. అప్పుడు ప్రత్యర్థికి పాయింట్ వస్తుంది. అయితే, ఇలాంటి రూల్ డిఫెండింగ్ జట్టు విషయంలో సరిగా లేదని భావించిన ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహకులు .. ఆ రూల్ను మార్చుకున్నారు. రైడర్ ఎవరైనా సరే అలా లాబీ మీదకు వెళ్తే అక్కడితో అతడిని ఎలిమినేట్ చేసేస్తారు. డిఫెండింగ్ జట్టుకు ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది.