అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులో న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ గ్రెగోర్ బాక్లీ, సింగపూర్కు చెందిన ఇమ్రాన్ ఖవాజా నిలిచారు. గడువు (అక్టోబర్ 18) ముగిసేలోపు వీళ్లిద్దరే నామినేషన్లు సమర్పించారు. ఎన్నికల్లో పోటీ చేస్తాడని ఊహించిన ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్.. తనకు మద్దతు లేని కారణంగా నామినేషన్ వేయలేదు. జులై 1న శశాంక్ మనోహర్ దిగిపోయినప్పటి నుంచి ఖవాజా తాత్కాలిక ఛైర్మన్గా కొనసాగుతున్నాడు.
ఐసీసీ ఛైర్మన్ రేసులో బాక్లీ, ఖవాజా
ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ గ్రెగోర్ బాక్లీ, సింగపూర్కు చెందిన ఇమ్రాన్ ఖవాజా నామినేషన్లు దాఖలు చేశారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కొలివ్ గ్రేవ్స్.. ఊహించిన మద్దతు లేని కారణంగా నామినేషన్ వేయలేదు. దీంతో బాక్లీ, ఖవాజాలకు ఏడాది చివరిలోగా ఎన్నిక జరిపి కొత్త ఛైర్మన్ను ఐసీసీ డైరెక్టర్ల బోర్డు ఎంచుకోనుంది.
"ఐసీసీ తాత్కాలిక ఛైర్మన్ ఖవాజా, బాక్లీ మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. వాళ్లిద్దరే నామినేషన్లు వేశారు. వాళ్లిద్దరికీ ఐసీసీ బోర్డులో సమానంగా మద్దతు ఉంది" అని ఓ ఐసీసీ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించాడు.
17 మంది బోర్డు సభ్యుల్లో 16 మందికి మాత్రమే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. సీఈఓ మను సాహ్నీకి ఓటు వేసే అధికారం లేదు. మొత్తం ఓట్లలో మూడింట రెండొంతులు అంటే 11 ఓట్లు వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లు. ఒకవేళ ఎన్నికలు జరిగే డిసెంబరు లోపు దక్షిణాఫ్రికాపై నిషేధం పడితే మొత్తం ఓట్ల సంఖ్య 15 కానుంది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి ప్రధాన టెస్టు దేశాల మద్దతు బాక్ లీకే ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపు ఇద్దరితో చర్చలు జరిపి ఛైర్మన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరగనున్నాయి.