తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2020, 11:43 PM IST

ETV Bharat / sports

తిరుగులేని ముంబయి.. రాజస్థాన్​పై ఘన విజయం

ముంబయి ఇండియన్స్​ హ్యాట్రిక్​ విజయాన్ని నమోదు చేసుకుంది. అబుదాబి వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో 57 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో టోర్నీలో ఆరు మ్యాచ్​లు ఆడిన రోహిత్​ సేన రెండింటిలో ఓడి.. నాలుగు మ్యాచ్​ల్లో నెగ్గి ప్రస్తుతం టేబుల్​ టాపర్​గా నిలిచింది.

MI vs RR: Mumbai beat Rajastan by 57 Runs
హ్యాట్రిక్​ విజయాన్ని నమోదు చేసుకున్న ముంబయి

ముంబయి మరోసారి ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్​ సేన .. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×2) అజేయ అర్ధశతకంతో రాణించడం వల్ల నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. స్మిత్​సేనను తన బౌలింగ్​తో బుమ్రా (4/20) దెబ్బతీశాడు. బట్లర్‌ (70; 44 బంతుల్లో, 4×5, 5×6) పోరాటం వృథా అయ్యింది.

ఛేదనలో బట్లర్ మినహా ఎవరూ పోరాడలేకపోయారు. ముంబయి పేసర్ల ధాటికి 12 పరుగులకే రాజస్థాన్​ మూడు వికెట్లు కోల్పోయింది . జైశ్వాల్‌, సంజు శాంసన్‌ డకౌటవ్వగా.. స్మిత్‌ ఆరు పరుగులకు ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహిపాల్ లొమ్రార్‌ (11; 13 బంతుల్లో, 1×4)తో కలిసి బట్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే లొమ్రార్‌ను రాహుల్ చాహర్‌ (1/24) బోల్తా కొట్టించాడు.

అనంతరం బట్లర్ గేర్‌ మార్చి బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తొలి 24 బంతుల్లో అతడు 24 పరుగులే చేశాడు. తర్వాత సిక్సర్లతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అయితే పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌కు ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. ఆఖర్లో ఆర్చర్‌ (24; 11 బంతుల్లో, 3×4, 1×6) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి. ముంబయి బౌలర్లలో బుమ్రా (4/20), బౌల్ట్‌ (2/26), ప్యాటిన్సన్‌ (2/19) రాణించారు.

అదరగొట్టిన సూర్యకుమార్‌

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆది నుంచే ఓపెనర్లు రోహిత్‌ శర్మ (35; 23 బంతుల్లో, 2×4, 3×6), డికాక్‌ (23; 15 బంతుల్లో, 3×4,1×6) బౌండరీల మోత మోగించారు. వీరిద్దరు కలిసి మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్న కార్తిక్ త్యాగి (1/36)..5వ ఓవర్‌లో డికాక్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హిట్‌మ్యాన్ స్కోరును ముందుకు నడిపించాడు.

అయితే రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపించి శ్రేయస్‌ గోపాల్ (2/28)ఆ జట్టును దెబ్బ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (12; 17 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. మరోవైపు సూర్యకుమార్ బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం రాజస్థాన్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న హార్దిక్‌ పాండ్య (30*; 19 బంతుల్లో 2×4, 1×6) ఆశించిన రీతిలో చెలరేగలేకపోయాడు.

ABOUT THE AUTHOR

...view details