'ఈ సాలా కప్ నమదే'... సోషల్ మీడియాలో ఈ నినాదంతో ఏటా వారి ఐపీఎల్ ప్రస్థానం మొదలవడం పరిపాటి. లీగ్ దశ చివరకు వచ్చేసరికి మాత్రం వారి లెక్కలే వేరుగా ఉంటాయి. 'చెన్నై ముంబయిని ఓడించి, పంజాబ్ హైదరాబాద్ను ఓడించి, మనం కేకేఆర్పై భారీ తేడాతో గెలిస్తే ప్లే-ఆఫ్కు సులభంగా చేరిపోతాం' ఈ విధంగా వ్యూహాలను సవరించుకోవడమూ ఆనవాయితీయే.
ఈ పాటికే ఆ జట్టు ఏంటో అర్థమైపోయి ఉంటుంది. నేటి(సెప్టెంబరు 21) నుంచి ఆ జట్టు తన ఐపీఏల్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. అది తలపడబోయే జట్టు మాత్రం అందుకు భిన్నం. ఏమాత్రం హడావిడి ఉండదు. కూల్గా ఉంటారు. సైలెంట్ కిల్లర్స్గా పని పూర్తిచేస్తారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో తిరుగేలేదు. ఈ సీజన్ మూడో మ్యాచ్ ద్వారా తమ టైటిల్ వేటను షురూ చేస్తున్నాయి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్రైజర్స్ హైదరాబాద్.
ఐపీఎల్లో ముంబయి-చెన్నై పోరు... భారత్-పాక్ అంత అంచనాలు పెంచేది అయితే.. ఆర్సీబీ-హైదరాబాద్ మ్యాచ్ను యాషెస్తో పోల్చినా అతిశయోక్తి కాదేమో. జట్ల వ్యక్తిగత రికార్డులు ఎలా ఉన్నప్పటికీ, ఒకటితో ఒకటి తలపడితే మాత్రం నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయం. గత రికార్డులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. 2013లో హైదరాబాద్ జట్టు ఏర్పడిన దగ్గర నుంచి ఆర్సీబీతో 15 మ్యాచ్లు ఆడితే... హైదరాబాద్ 8, బెంగళూరు 6 కైవసం చేసుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2016 ఫైనల్లో తలపడినప్పుడు సన్రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది.
ఆ ఫైనల్ ను, 2017లో రద్దయిన ఒక్క మ్యాచ్ మినహాయిస్తే.. 2013, 14, 15, 16, 18, 19 లీగ్ దశలో ఉండే రెండు మ్యాచ్ లను చెరొకటి గెలుచుకున్నాయి. అంటే ఎప్పటి ప్రతీకారం అప్పుడే తీర్చేసుకుంటున్నాయన్నమాట. ఆ ప్రకారం చూస్తే నేటి పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.
ఆర్సీబీ బలాబలాలేంటి?
కాస్తో కూస్తో క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవర్ని అడిగినా ఆర్సీబీ బలం అంటే కోహ్లీ, డివిలియర్స్ అనే చెప్తారు. దానికి కొనసాగింపుగా ఆ ఇద్దరే వాళ్ల బలహీనత అని కూడా చెప్తారు. అది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికి 12 సీజన్లు జరిగితే కేవలం ఐదుసార్లే తుది నాలుగులో నిలిచింది.
ఆర్సీబీ మొదట్నుంచీ బ్యాటింగ్ ప్రధాన జట్టే. లీగ్లో అత్యధిక స్కోరు చేసిన జట్టు ఇదే. వ్యక్తిగత శతకాలు సైతం ఆ జట్టు తరఫునే ఎక్కువ(13). 2011 నుంచి 2017 వరకూ గేల్+కోహ్లీ+డివిలియర్స్= ఆర్సీబీ అన్నట్టు ఆ జట్టు ప్రయాణం సాగింది. వేలం సమయంలోనూ వీళ్ల చుట్టూనే బ్యాటింగ్ ఆర్డర్ను బలపర్చుకున్నారే తప్ప... బౌలింగ్ దళాన్ని మెరుగుపర్చుకోవడంలో ఎప్పుడూ అంచనా తప్పుతూ వచ్చారు.
దురదృష్టమో ఏంటో కానీ, వేరే జట్టులో ఆడి ఇక్కడికి వచ్చి బాగా రాణించిన ఆటగాళ్లు తక్కువే. అదే సమయంలో ఆర్సీబీ నుంచి ఇతర జట్లకు వెళ్లి అదరగొట్టినవారు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి కొన్ని అనుకోని దురదృష్టాల వల్ల చోకర్స్ అన్న అక్కర్లేని బిరుదును మూటగట్టుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం జట్టులో కీలకంగా ఉన్న చాహల్ మినహా గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా నిలకడగా రాణించిన బౌలర్ కనపడట్లేదు. ఉమేశ్ యాదవ్ గత రెండు సీజన్లుగా పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్లో బ్యాటింగ్లో కోహ్లీ, ఏబీడీ ప్రధానం కానుండగా... ఆసీస్ సారథి ఫించ్, యువ కెరటం దేవ్ దత్ పడిక్కల్, ఆల్ రౌండర్లు మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్తో లైనప్ ఎప్పటిలానే పటిష్ఠంగా కనిపిస్తోంది. అవసరమైతే డివిలియర్స్ కీపింగ్ కూడా చేస్తాడని టీమ్ మేనేజ్మెంట్ చెప్పడం వల్ల కొన్ని మ్యాచ్ ల వరకూ పార్థివ్ బెంచ్ కే పరిమితమవచ్చు. ఫించ్ అంచనాలు అందుకోలేకపోతే, కొన్ని మ్యాచ్ల తర్వాత యువ ఆస్ట్రేలియన్ బ్యాట్సమన్ ఫిలిప్పీకి అవకాశం దక్కచ్చు.
బౌలింగ్ విభాగంలో చాహల్ ఉండనే ఉన్నాడు. అధిక ధరకు కొనుగోలు చేసిన మోరిస్తో పాటు, సీనియర్ పేసర్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ నిలకడ తెచ్చుకోవాలని బెంగళూరు కోరుకుంటోంది. కొన్నాళ్లుగా గాయాలతో సతమతమైన స్టెయిన్ గన్ మళ్లీ మునపటిలా పేలుతుందో లేదో అనుమానమే. ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ ఆడం జంపా ఉన్నప్పటికీ... చాహల్ ఉండగా తుది జట్టులో మరొక లెగ్గీని ఆడిచకపోవచ్చు.
హైదరాబాద్ బలాబలాలు