Ellyse Perry Ind Vs Aus : ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు ప్లేయర్ ఎలీస్ పెర్రీ తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ముంబయి వేదికగా ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్తో తన ఇంటర్నేషనల్ కెరీర్లో 300వ మ్యాచ్లను పూర్తి చేసుకోనుంది. అలా మహిళల క్రికెట్ చరిత్రలో 300 ప్లస్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన క్రికెటర్ల జాబితాలో స్థానం సంపాదించుకోనుంది. అయితే ఈ లిస్ట్లో ఇప్పటికే 333 మ్యాచులతో టీమ్ఇండియా మాజీ సారథి మిథాలీ రాజ్ మొదటి స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ స్టార్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (309), కివీస్ మాజీ క్రికెటర్ సూజీ బేట్స్ (309) తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు.
Ellyse Perry Career : పెర్రీ కెరీర్ను చూస్తే 2007లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ క్రికెటర్ తన సుదీర్ఘ కెరీర్లో ఇప్పటి వరకు 12 టెస్టులు, 141 వన్డేలు, 146 టీ20లు ఆడింది. డజను టెస్టులాడిన పెర్రీ 21 ఇన్నింగ్స్లలో 925 పరుగులు, 141 వన్డేలలో 114 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్కు వచ్చి 3,852 పరుగులు చేసింది.
India Vs Australia Womens : ప్రస్తుతం ఆస్ట్రేలియా- భారత్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో టీమ్ఇండియా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లోనూ దూకుడు చూపించి తొలి టీ20లో ఘన విజయాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో ఆసీస్ సేనను చిత్తు చేసింది. తొలుత తితాస్ సాధు (4/17) ధాటికి ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలోనే 141 పరుగులు స్కోర్ చేసింది. లిచ్ఫీల్డ్ (49), ఎలీస్ పెర్రీ (37), ఆసీస్ జట్టులో రాణించారు. ఇక భారత్ నుంచి షెఫాలి వర్మ (64*); స్మృతి మంధాన (54) సూపర్ ఫామ్లో ఆడటం వల్ల టీమ్ఇండియా 17.4 ఓవర్లలో ఒకే వికెటే కోల్పోయి టార్గెట్ను అందుకుంది.