రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికవ్వడం అదృష్టమని యువ క్రికెటర్ సంజు శాంసన్ అన్నాడు. విషయం ప్రకటించిన వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ తనకు సందేశాలు పంపించారని తెలిపాడు. వారు అభినందనలు తెలపడంతో ఆనందం పట్టలేకపోయానని వెల్లడించాడు. క్రికెట్ దిగ్గజం సంగక్కరతో కలిసి పనిచేయడం కన్నా ఇంకేం కావాలని అంటున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం విజేత రాజస్థాన్ రాయల్స్. తొలి ట్రోఫీ అందుకున్న ఆ జట్టుకు మళ్లీ అదృష్టం కలిసిరాలేదు. రెండేళ్లు నిషేధానికీ గురైంది. ఎంతోమంది విదేశీ, స్వదేశీ సీనియర్లను ప్రయత్నించినా టైటిల్ కొట్టలేకపోయారు. ఈ సీజన్ వేలానికి ముందు స్టీవ్స్మిత్ను వదిలేసిన రాజస్థాన్ సంజు శాంసన్ తమ కెప్టెన్ అని ప్రకటించి సంచలనం సృష్టించింది. అతడిపై భారీ ఆశలే పెట్టుకొంది. క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర్ను నియమించుకుంది.