విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో పరుగుల వరద పారింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్-రాహుల్ శతకాలతో చెలరేగగా... ఆఖర్లో శ్రేయస్, పంత్ సిక్సర్ల మోత మోగించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది భారత్.
రోహిత్-రాహుల్ ఇన్నింగ్స్...
సిరీస్ కాపాడుకోవాలంటే కచ్చితంగా గెలవాలన్న కసి ఓ వైపు... భారీ స్కోరు సాధిస్తే తప్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం సులభం కాదన్న విషయం మరోవైపు... ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న టీమిండియా ఓపెనర్లు.. తొలుత చాలా నెమ్మదిగా, నిలకడగా ఆడారు. వీలుచిక్కితే తప్ప అనవసరపు షాట్లకు పోకుండా శైలికి తగ్గట్లు ఆడాడు రోహిత్. ఈ మ్యాచ్లో ఈ జోడీ శతకాలతో చెలరేగింది. రోహిత్ కెరీర్లో 28వ శతకం నమోదు చేసుకోగా, రాహుల్.. వన్డే కెరీర్లో మూడో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
- రోహిత్@28, రాహుల్@3...
ఈ మ్యాచ్ 107 బంతుల్లో శతకం సాధించిన రోహిత్... 159 పరుగుల(138 బంతుల్లో; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కెరీర్లో 28వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్ రాహుల్.. 102(104 బంతుల్లో; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. కెరీర్లో మూడో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా స్వదేశంతో తొలి శతకం చేశాడు రాహుల్. ఈ ఓపెనింగ్ ద్వయం తొలి వికెట్కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.
ఈ ఏడాది టీమిండియా ఓపెనర్ రోహిత్...10 సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో ఏడు శతకాలు సాధించాడు. ఈ ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డునూ తన పేరిట లిఖించుకున్నాడు. 1998లో సచిన్ తెందూల్కర్(9) సాధించిన రికార్డును అధిగమించాడు హిట్మ్యాన్.
2019లో ఐసీసీ టాప్-9 వన్డే ర్యాంకింగ్స్లో ఉన్న జట్లలో న్యూజిలాండ్ మినహా అన్ని జట్లపై రోహిత్ శతకాలు చేశాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల వీరుల జాబితాలో హిట్మ్యాన్ టాప్లో కొనసాగుతున్నాడు. 1427 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో కోహ్లీ(1292), విండీస్ బ్యాట్స్మన్ షై హోప్(1225) ఉన్నారు.