రోడ్డు భద్రత అవగాహన టీ20 సిరీస్లో భాగంగా ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్లో.. శ్రీలంక లెజెండ్స్ ఇచ్చిన 139 పరుగులు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది ఇండియా లెజెండ్స్. భారత బ్యాటింగ్లో ఇర్ఫాన్ పఠాన్(57), కైఫ్(46) రాణించారు.
ఛేదనలో సచిన్(0), సెహ్వాగ్(3), యువరాజ్(1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా.. కైఫ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపించాడు. బంగర్(18) సాయంతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో పఠాన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అర్ధశతకం చేసిన పఠాన్.. 6 ఫోర్లు, 3 సిక్సర్లు సాధించాడు. కేవలం 31 బంతుల్లోనే ఇన్ని పరుగులు సాధించాడు.
ఓపెనింగ్ ఫర్వాలేదు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు దిల్షాన్ 23(23 బంతుల్లో; 4 ఫోర్లు), కలువితరణ 21(25 బంతుల్లో; 4ఫోర్లు) తొలి వికెట్కు 46 పరుగులు జోడించారు. దిల్షాన్ను మునాఫ్ పటేల్ ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కలువితరణను ఇర్ఫాన్ పఠాన్ పెవిలియన్కు చేర్చాడు. తర్వాత వచ్చిన ఆటపట్టు (1), తుషారా (10) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన సచిత్ర సేననాయక 19(15 బంతుల్లో; 3 ఫోర్లు)తో కలిసి కపుగెదర 23(17 బంతుల్లో; 3ఫోర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరు చక్కని షాట్లతో అలరించారు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
ఇండియా లజెండ్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్ నాలుగు వికెట్ల(4/19)తో సత్తాచాటాడు. జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, మన్ప్రీత్ గోని, సంజయ్ బంగర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో మహ్మద్ కైఫ్ అద్భుత ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. మునపటిలా అతడు డైవ్లు చేస్తూ ఫీల్డింగ్ చేయడం విశేషం. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ సిరీస్ను నిర్వహిస్తోంది.