ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా 'డ్రీమ్ 11'ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2021, 2022 సీజన్లకు స్పాన్సర్గా కొనసాగుతామన్న ఆ సంస్థ ప్రతిపాదనను బోర్డు తిరస్కరించింది. మూడేళ్ల షరతు ఉన్నప్పటికీ తక్కువ మొత్తం చెల్లిస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది.
'చైనా వస్తు బహిష్కరణ' ఉద్యమం బలంగా ఉండటం వల్ల ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్గా ఉండలేమని వివో మొబైల్స్ ఇంతకుముందు ప్రకటించింది. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి రూ.444 కోట్లు నష్టపోయాయి. దానిని పూడ్చుకునేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా బైజుస్ (రూ.201 కోట్లు), అన్అకాడమీ (రూ.170 కోట్లు), డ్రీమ్ 11 (రూ.222 కోట్లు) పోటీపడ్డాయి. చివరికి అత్యధిక మొత్తం వేసిన డ్రీమ్ 11కే హక్కులు దక్కాయి. అయితే రూ.240 కోట్లు చెల్లిస్తూ మరో రెండేళ్లు కొనసాగుతామని కంపెనీ కోరగా బీసీసీఐ తిరస్కరించింది.