ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 వ్యవహారాలను పర్యవేక్షించేందుకు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ప్రత్యేక విమానంలో దుబాయ్కి బయల్దేరారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఆరు నెలల తర్వాత తొలిసారి దుబాయ్ విమానం ఎక్కుతున్నానని, జీవితంలో వచ్చిన మార్పులు క్రేజీగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్19 నుంచి లీగ్ ఆరంభంకానుంది.
మార్చిలో మొదలవ్వాల్సిన ఐపీఎల్-2020 కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. రూ.4000 కోట్ల విలువైన సీజన్ను నిర్వహించేందుకు బీసీసీఐ ఎంతో శ్రమించింది. సరైన విండో (కాలం) కోసం ఎదురుచూసింది. టీ20 ప్రపంచకప్, ఆసియాకప్ వాయిదా పడటం వల్ల అదే సమయాన్ని ఇందుకోసం వినియోగించుకుంది. భారత్లో పరిస్థితులు అనువుగా లేకపోవడం వల్ల వేదికను యూఏఈకి తరలించింది. షార్జా, దుబాయ్, అబుదాబిల్లో మ్యాచులు నిర్వహించనుంది.