తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2020, 5:50 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం రంగంలోకి దిగిన గంగూలీ

ఐపీఎల్​ 13వ సీజన్​ సెప్టెంబర్​ 19 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే యూఏఈ చేరుకున్న ఆటగాళ్లంతా ప్రాక్టీస్​లో నిమగ్నమై ఉన్నారు. అయితే టోర్నీ పనులను పర్యవేక్షించేందుకు ఆ దేశానికి పయనమయ్యారు బీసీసీఐ అధ్యక్షుడు దాదా. కరోనా వల్ల దాదాపు 6 నెల‌ల త‌ర్వాత తొలిసారి విమానం ఎక్కినట్లు పేర్కొంటూ.. ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

Ganguly takes flight
ఐపీఎల్​ కోసం రంగంలోకి దిగిన గంగూలీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 వ్యవహారాలను పర్యవేక్షించేందుకు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి బయల్దేరారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు. ఆరు నెలల తర్వాత తొలిసారి దుబాయ్‌ విమానం ఎక్కుతున్నానని, జీవితంలో వచ్చిన మార్పులు క్రేజీగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌19 నుంచి లీగ్‌ ఆరంభంకానుంది.

మార్చిలో మొదలవ్వాల్సిన ఐపీఎల్‌-2020 కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. రూ.4000 కోట్ల విలువైన సీజన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ఎంతో శ్రమించింది. సరైన విండో (కాలం) కోసం ఎదురుచూసింది. టీ20 ప్రపంచకప్‌, ఆసియాకప్‌ వాయిదా పడటం వల్ల అదే సమయాన్ని ఇందుకోసం వినియోగించుకుంది. భారత్‌లో పరిస్థితులు అనువుగా లేకపోవడం వల్ల వేదికను యూఏఈకి తరలించింది. షార్జా, దుబాయ్‌, అబుదాబిల్లో మ్యాచులు నిర్వహించనుంది.

ఐపీఎల్​ స్టేడియం

ఆగస్టు 20 తర్వాత ఫ్రాంఛైజీలన్నీ దుబాయ్‌, అబుదాబికి చేరుకోగా వారం రోజులు ప్రశాంతంగానే గడిచింది. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి వైరస్‌ సోకడం, స్టార్‌ సిబ్బంది, బీసీసీఐ సిబ్బందికీ కొవిడ్‌-19 రావడం కలకలం సృష్టించింది. సీనియర్‌ ఆటగాళ్లైన రైనా, హర్భజన్‌ దూరమవ్వడం సందిగ్ధానికి తావిచ్చింది. అంతేకాదు పూర్తి షెడ్యూల్​ను ప్రకటించేందుకూ బీసీసీఐ సమయం తీసుకుంది. ఆ తర్వాత పరిస్థితులన్నీ చక్కబెట్టిన దాదా.. ప్రత్యక్షంగానూ రంగంలోకి దిగుతున్నారు. మిగిలిన వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌, మరికొందరు అధికారులు దుబాయ్​లో ఉన్నారు.

ఇదీ చూడండి: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్​ వీరి మధ్యే!

ABOUT THE AUTHOR

...view details