రాష్ట్రంలో మూతపడిన సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. కరోనా ప్రభావంతో దాదాపు 9 నెలలుగా తెరుచుకోని హాళ్లలో ప్రదర్శనలు మొదలుపెట్టాలని తెలంగాణ సినిమా థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు తెలుగు నిర్మాతల మండలితో... మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమానులు జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో తెరపై బొమ్మ పడనుంది. కేవలం 50 శాతం ప్రేక్షకులతోనే సినిమాలను ప్రదర్శించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సీటుకు సీటుకు మధ్య క్రాస్ మార్క్ చేశారు. టికెట్ కౌంటర్ల వద్ద దూరం పాటిస్తూ... తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే బోర్డులను ఏర్పాటు చేశారు. హాల్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
హాలీవుడ్ చిత్రాలతో
ప్రస్తుత పరిస్థితుల్లో సినియాలకు ప్రేక్షకుల రావడం ప్రశ్నార్థకంగా ఉందని థియేటర్ల యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలో తొలుత హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. అందులో భాగంగా "టెనెట్" చిత్రంతో థియేటర్లను పునఃప్రారంభిస్తున్నారు. 2 వారాల తర్వాత తెలుగు సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు, పంపిణీదారులు సిద్ధమవుతున్నారు. నాని నటించిన "వీ" సినిమాను ఈనెల 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.