తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2020, 7:46 AM IST

ETV Bharat / sitara

ప్రేక్షకులకు కనువిందు చేసే ఈ అందాలు 'ప్రత్యేకం'

సినిమా ప్రియులను అలరించడంలో ప్రత్యేక గీతాలది ప్రథమ స్థానం. ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేక తారలుండేవారు. అగ్ర కథానాయికలు చేయడం మొదలుపెట్టాక వాటి క్రేజే మారిపోయింది. తారలు ఒక్క పాటతోనే బోలెడంత పేరు, పారితోషికం సంపాదిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక గీతాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్న కొందరు కథానాయికలపై కథనం.

tollywood-heroines-special-songs
ప్రేక్షకులను అలరించే ఈ అందాలు ప్రత్యేకం

మా సినిమాలో అదే ‘ప్రత్యేకం’ అంటూ దర్శకనిర్మాతలు కొన్ని విషయాల్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. దాన్నే ఎక్కువగా ప్రచారం చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి అంశాల్లో ప్రత్యేక గీతం ప్రథమ స్థానంలో ఉంటుంది. యువతరాన్ని అమితంగా ఆకట్టుకునేది ఇదే. కథలో జోష్‌ పెంచాలన్న ఆలోచన రాగానే గుర్తుకొచ్చేది అదే. వాణిజ్య సూత్రాల్లో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇక అగ్ర హీరోల సినిమాల్లో ఆ పాటకి ఉండే క్రేజే వేరు. ఒకప్పుడు ఐటెమ్‌ గాళ్స్‌ అని అందులో ఆడిపాడేందుకు ప్రత్యేకమైన తారలు ఉండేవాళ్లు. ఇప్పుడు అగ్ర నాయికలు సైతం ఆ పాటలో ఆడిపాడుతున్నారు. ఆ ఒక్క పాటతోనే బోలెడంత పేరు, పారితోషికాన్ని సంపాదిస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రత్యేకగీతాల సందడి తెలుగులో ఎక్కువగానే కనిపించబోతోంది. పేరున్న నాయికలు ఆ పాటల్లో సందడి చేయబోతున్నారు.

గతంలోలా ఐటెమ్‌ గీతం, ఐటెమ్‌ భామలనే పదాలు ఇప్పుడు వినిపించడం లేదు. నాయికలు ఆ పాటల్లో ఆడిపాడటం మొదలుపెట్టాక వాటి ముఖచిత్రమే మారిపోయింది. ఐటెమ్‌ పాట అని కాకుండా... ప్రత్యేక గీతం అని పిలుస్తున్నారు. ఐటెమ్‌ భామలంటూ ఇప్పుడు ప్రత్యేకంగా ఎవ్వరూ కనిపించడం లేదు. హీరోయిన్లే వాళ్ల స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. తమన్నా, శ్రుతిహాసన్‌, కాజల్‌, పూజాహెగ్డే... ఇలా ప్రముఖ కథానాయికలు కూడా ప్రత్యేక గీతాల్లో ఆడిపాడుతూ అదరగొడుతున్నారు. చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో ఓ ప్రత్యేకగీతం ఉంది. అందులో రెజీనా ఆడిపాడింది. ఇప్పటికే ఆ పాటని తెరకెక్కించారు. చిరు సినిమాలో ప్రత్యేకగీతం అంటే ఇక అదెంత ప్రత్యేకంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. రామ్‌ చిత్రం ‘రెడ్‌’లోనూ అలాంటి జోష్‌ పెంచే ఓ పాట ఉంది. అందులో హెబ్బా పటేల్‌ ఆడిపాడింది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో వారం రోజులపాటు రాత్రి వేళల్లో ఆ గీతాన్ని తెరకెక్కించారు.

బాలీవుడ్‌ నుంచి

గోపీచంద్‌ కోసం ప్రత్యేకంగా బాలీవుడ్‌ నుంచి ఓ అందం వస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీ కథానాయకుడిగా ‘సీటీమార్‌’ తెరకెక్కుతోంది. తమన్నా నాయిక. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉండనుంది. అందులో ఆడిపాడేందుకు బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌటేలా ఎంపికైంది. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి తన అందంతో కుర్రాళ్ల మనసు దోచింది ఊర్వశి. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఓ ప్రత్యేకగీతం ఉన్నట్టు సమాచారం. అందులో కూడా ఓ ప్రముఖ కథానాయిక ఆడిపాడనుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది తెలుగు తెర ప్రత్యేక మెరుపులతో ప్రేక్షకుల్ని మురిపించనుంది.

ఇదీ చూడండి: కళ్లజోడుతో క్లాస్​గా కనిపించే ఊరమాస్​ డైరెక్టర్​

ABOUT THE AUTHOR

...view details