'లవర్బాయ్' అంటే ఇప్పటికీ గుర్తొచ్చే పేరు తరుణ్. తనదైన నటన, స్టైల్తో అమ్మాయిల కలల రాకుమారుడిగా, వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడీ హీరో. పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించి, 'నువ్వే కావాలి'తో కథానాయకుడిగా మారాడు. అయితే ఒకానొక సందర్భంలో ఓ అమ్మాయి తరుణ్ కోసం రక్తంతో ప్రేమలేఖ రాసింది. అది చూసి షాకవడం అతడి వంతయింది. విషయాలన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఈరోజు తరుణ్ పుట్టినరోజు.
రెండో తరగతిలోనే బాలనటుడిగా ఎంట్రీ
తరుణ్.. మద్రాస్లో రెండో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నం 'అంజలి'లో నటించే అవకాశమొచ్చింది. ఒకసారి తరుణ్ ఇంటికి ఓ కో-డైరెక్టర్ భోజనానికి వచ్చారట. ఆ సమయంలో తరుణ్ను అతడు చూసి... మణిరత్నం 'అంజలి' తెరకెక్కిస్తున్నారని, అందులోని ఓ పాత్ర కోసం చిన్న అబ్బాయిని వెతుకుతున్నట్టు తరుణ్ తల్లిదండ్రులతో చెప్పారు. చివరికి అలా ఆ పాత్రలో తరుణ్ నటించాడు.
ఆ తర్వాత 'దళపతి', 'సూర్య ఐపీఎస్', 'పిల్లలు దిద్దిన కాపురం', 'ఆదిత్య 369', 'తేజ', 'మనసు మమత' తదితర సినిమాలలో బాలనటుడిగా అలరించాడు.
'నువ్వే కావాలి'తో హీరోగా ఎంట్రీ
తరుణ్.. 1995లో వచ్చిన 'వజ్రం'లో నటించిన తర్వాత.. చదువు కోసం కొన్నాళ్లు విరామం తీసుకొన్నాడు. అనంతరం 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'అంకుల్', 'ప్రియమైన నీకు', 'చిరుజల్లు', 'అదృష్టం', 'నువ్వే నువ్వే', 'నువ్వులేక నేను లేను', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఎలా చెప్పను', 'నీ మనసు నాకు తెలుసు', 'సఖియా', 'సోగ్గాడు', 'ఒక ఊరిలో', 'నవ వసంతం', 'భలే దొంగలు', 'శశిరేఖ పరిణయం', 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', 'యుద్ధం','వేట', 'ఇది నా లవ్ స్టోరీ' చిత్రాల్లో నటించాడు.