ఆయనలో స్వరాల్ని సృష్టించే సంగీతకారుడే కాదు.. అద్భుతంగా పాడే గాయకుడు ఉన్నారు. పాటకు సాహిత్యం సమకూర్చడంలోనూ ఆ సంగీతపుత్రుడిది అందవేసిన చేయి. ఇలా సంగీతం, గానం, రచన తెలిసిన అరుదైన మ్యూజిక్ డైరెక్టర్లలో కీరవాణి ఒకరు. 'మరకతమణి', 'వేదనారాయణ', 'ఎమ్.ఎమ్.క్రీమ్'.. అంతా మన కీరవాణే. జులై 4న ఈయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ ప్రస్థానం గురించిన ఆసక్తికర విషయాలు.
28 ఏళ్లుగా తెలుగు శ్రోతల్ని తన సుస్వరాలతో మైమరిపిస్తున్న కీరవాణి.. అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా ఏ భాషలోకి వెళ్లినా తన పని తీరుతో విశిష్టతను చాటుకొన్న సంగీత దర్శకుడు ఆయన. హిందీలో ఆయన్ని ముద్దుగా ఎమ్.ఎమ్.క్రీమ్ అని పిలుచుకుంటారు. కన్నడ నాట ఒకలా, తమిళంలో మరొకలా శ్రోతలకు సుపరిచితమైన వ్యక్తి కీరవాణి. ఓ సినిమా విజయంలో సంగీతం ఎంత కీలకపాత్ర పోషిస్తుందో ఈయన పనితీరే చెబుతుంది.
తొలి సినిమా అదే..
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన కీరవాణి 1990లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'మనసు మమత' చిత్రంతో సంగీత దర్శకుడిగా చిత్రసీమకు పరిచయమయ్యారు. 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి.. 'కలెక్టర్గారి అబ్బాయి', 'భారతంలో అర్జునుడు' తదితర చిత్రాలకు పనిచేశారు. తొలి ప్రయత్నంగా 'కల్కి' అనే సినిమాకు స్వరాలు సమకూర్చారు. అయితే, ఆ చిత్రం విడుదల కాలేదు. దాంతో సాంకేతికంగా 'మనసు మమత'నే ఆయనకు తొలి చిత్రమైంది.