తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2020, 5:32 AM IST

Updated : Jul 4, 2020, 6:32 AM IST

ETV Bharat / sitara

అద్భుతాల సృష్టికర్త.. స్వర మాంత్రికుడు కీరవాణి

సంగీత వాయిద్యాలతో తేనెరాగాలొలికించి.. పాటలతో శ్రోతలను మంత్రముగ్దులను చేసే కీరవాణి పుట్టిన రోజు నేడు. 'మనసు మమత' చిత్రం నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచిన 'బాహుబలి' వరకు ఆయన స్వరాలు అందించారు. ఈ సందర్భంగా కీరవాణి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు.

MM. KEERAVANI BIRTH DAY SPECIAL STORY
స్వర మాంత్రికుడు.. గాన గంధర్వుడు

ఆయనలో స్వరాల్ని సృష్టించే సంగీతకారుడే కాదు.. అద్భుతంగా పాడే గాయకుడు ఉన్నారు. పాటకు సాహిత్యం సమకూర్చడంలోనూ ఆ సంగీతపుత్రుడిది అందవేసిన చేయి. ఇలా సంగీతం, గానం, రచన తెలిసిన అరుదైన మ్యూజిక్​ డైరెక్టర్లలో కీరవాణి ఒకరు. 'మరకతమణి', 'వేదనారాయణ', 'ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌'.. అంతా మన కీరవాణే. జులై 4న ఈయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ ప్రస్థానం గురించిన ఆసక్తికర విషయాలు.

ఎంఎం కీరవాణి

28 ఏళ్లుగా తెలుగు శ్రోతల్ని తన సుస్వరాలతో మైమరిపిస్తున్న కీరవాణి.. అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా ఏ భాషలోకి వెళ్లినా తన పని తీరుతో విశిష్టతను చాటుకొన్న సంగీత దర్శకుడు ఆయన. హిందీలో ఆయన్ని ముద్దుగా ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌ అని పిలుచుకుంటారు. కన్నడ నాట ఒకలా, తమిళంలో మరొకలా శ్రోతలకు సుపరిచితమైన వ్యక్తి కీరవాణి. ఓ సినిమా విజయంలో సంగీతం ఎంత కీలకపాత్ర పోషిస్తుందో ఈయన పనితీరే చెబుతుంది.

తొలి సినిమా అదే..

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన కీరవాణి 1990లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన 'మనసు మమత' చిత్రంతో సంగీత దర్శకుడిగా చిత్రసీమకు పరిచయమయ్యారు. 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి.. 'కలెక్టర్‌గారి అబ్బాయి', 'భారతంలో అర్జునుడు' తదితర చిత్రాలకు పనిచేశారు. తొలి ప్రయత్నంగా 'కల్కి' అనే సినిమాకు స్వరాలు సమకూర్చారు. అయితే, ఆ చిత్రం విడుదల కాలేదు. దాంతో సాంకేతికంగా 'మనసు మమత'నే ఆయనకు తొలి చిత్రమైంది.

పురస్కారాల పంట..

1991లో విడుదలైన 'క్షణక్షణం'తో కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా పత్యేకంగా మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కథ ఎలాంటిదైనా దానికి తన సంగీతంతో.. కొత్త కళను తీసుకురావడంలో దిట్ట. 'అన్నమయ్య' చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. 'రాజేశ్వరి కళ్యాణం', 'అల్లరి ప్రియుడు', 'పెళ్ళి సందడి', 'ఒకటో నెంబర్‌ కుర్రాడు', 'ఛత్రపతి', 'వెంగమాంబ', 'ఈగ', 'బాహుబలి' చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు.

అంతర్జాతీయ స్తాయి గుర్తింపు..

'స్టూడెంట్‌ నెంబర్‌ 1', 'మర్యాద రామన్న', 'బాహుబలి' చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఎనిమిది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం కూడా అందుకున్న ఘనకీర్తి పొందిన వ్యక్తి కీరవాణి. 'బాహుబలి' చిత్రాలతో ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. కీరవాణి ఇంటినిండా ప్రతిభావంతులే. ఆయన భార్య శ్రీవల్లి లైన్‌ ప్రొడ్యూసర్‌గా పలు చిత్రాలకు పనిచేశారు. తమ్ముడు కల్యాణ్ మాలిక్‌ సంగీత దర్శకుడు. తనయుడు కాలభైరవ గాయకుడిగా రాణిస్తున్నారు.

ఇదీ చూడండి:కీరవాణి నోట కరోనా పాట... నెట్టింట వైరల్​

Last Updated : Jul 4, 2020, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details