'రావాలని కోరుకున్న మనిషి వచ్చినపుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటీ? రాననుకున్నారా? రాలేననుకున్నారా?' అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్.. ఏ అభిమాని మర్చిపోలేడోమో! ఇది బి.గోపాల్, చిరు కాంబినేషన్లో వచ్చిన 'ఇంద్ర' సినిమాలో. ఈ చిత్రం వచ్చి నేటికి 18 ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ సినిమా, అందులోని డైలాగులు ఓ సంచలనమే. ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసిన 'ఇంద్ర'.. చిరంజీవి కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచింది. ఇంద్రసేనా రెడ్డి,శంకర్ నారాయణగా రెండు పాత్రల్లోనూ అభిమానుల్ని అలరించారు చిరు.
ఈ సినిమాకు పరుచూరి సోదరుల మాటలు, మణిశర్మ సంగీతం అదనపు బలం. 'దాయి దాయి దామ్మా' పాటలో చిరు వేసిన స్టెప్పులు కుర్రకారును థియేటర్లలో కూర్చోనివ్వకుండా చేసిందంటే అతిశయోక్తి కాదేమో. వైజంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ దీనిని నిర్మించారు. వీరిద్దరి కలయికలో ఇది మూడో చిత్రం. యాక్షన్ సీన్స్ ఎంత అద్భుతంగా చిత్రీకరించారో కామెడీకి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ చిత్రంలో చిరు సరసన సోనాలి బింద్రే,ఆర్తి అగర్వాల్ ఆడిపాడి అభిమానుల్ని ఆకట్టుకున్నారు.
'ఇంద్ర' కొన్ని ఫేమస్ డైలాగ్లు
- వీర శంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా
- సింహాసనంపై కూర్చొనే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డిది
- కాశీకి వెళ్లాడు. కాషాయం ధరించాడు అనుకున్నారా? వారణాసి వెళ్లాడు. తన వరస మార్చుకున్నాడు అనుకున్నారా? అదే రక్తం.. అదే పౌరుషం. సై అంటే సెకనుకొక తల తీసుకెళ్తా.
- షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని పోతున్నాను. అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. మా వాడు ఫోన్ చేసే దాక వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేను అడగను. పెళ్లి కావాల్సిన పిల్లని పది మందిలోకి పిలిచి పంచాయతీ పెట్టకు, తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో