శాశ్వతం అనే పదానికి ఓ సారి ఎందుకో... తన చిరునామా వెతుక్కోవాలని అనిపించింది. అదీ క్షణికమైన ఆనందాన్ని... జీవితకాల అనుభూతిని పంచే సినిమాల్లో. మెల్లగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందర్నీ వెతుక్కుంటూ వెళ్లసాగింది. తను అంకితమవ్వాలంటే ఆ పాత్ర కేవలం నటనకు పరిమితమైనంత మాత్రాన సరిపోదు. అంతకు మించిన లక్షణాలు ఉండాలి. ఆ అన్వేషణలో ఓ నటుడిని పరిశీలనగా చూసింది. చిన్న చిన్న కళ్లు అతనివి. కానీ వెయ్యిమాటలకు సరిపడా భావాలను ప్రకటిస్తున్నాయి. ఆ ముఖ వర్చస్సుకు.. ఆ సమ్మోహనానికి ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే. నటనకు మించి ఆయనలో ఉన్న ప్రతిభ అనిర్వచనీయం. ఇదే శాశ్వతానికి నిలువెత్తు నిదర్శనం. ఇంకేం కావాలి ఆయన ఒడికి హాయిగా చేరుకుంది . శాశ్వతానికి ఆయన్ను పర్యాయపదంలా మార్చి...జీవితకాలపు అనుభూతినిచ్చే నటుడిని గౌరవించింది.
పాకిస్థాన్లో జననం..
హిందీ సినిమాల్లో..దిలీప్ కుమార్ ప్రస్థానం చాలా సాదాసీదాగా ప్రారంభమైంది. ఏడున్నర దశాబ్దాల తర్వాత తన గురించి భావితరాలు మాట్లాడుకునేంత గొప్ప నటుడవుతాడని దిలీప్ కుమార్ ను అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు కూడా. అవిభక్త భారత్ లో 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్ లోని పెషావర్ లో కి దిలీప్ కుమార్ జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. తండ్రి పేరు లాలా గులామ్ శర్వార్ ఖాన్, తల్లి పేరు ఆయేషా బేగం. తన తల్లితండ్రులకున్న పన్నెండు మంది సంతానంలో ఒకడైన యూసుఫ్ ఖాన్...తండ్రితో కలిసి తమకున్న పండ్లతోటలో పనిచేసేవాడు. తండ్రికి పండ్ల వ్యాపారంలో సహకరించేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శర్వార్ ఖాన్ పిల్లల చదువు కోసం కుటుంబాన్ని మహారాష్ట్రలోని నాసిక్ కు మార్చారు.అలా నాసిక్ కు వచ్చిన యూసుఫ్ ఖాన్ విద్యాభ్యాసం అంతా నాసిక్ లో పూర్తి చేసుకున్నారు. అక్కడే తర్వాతి కాలంలో గొప్పనటుడిగా పేరుతెచ్చుకున్న రాజ్ కపూర్ తో పరిచయం ఏర్పడింది. బాల్యమిత్రుడిగా రాజ్ కపూర్ తో చాలా కలివిడిగా ఉండేవాడు యూసుఫ్ ఖాన్. అనంతరం 1940 ప్రాంతంలో తన తండ్రితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు యూసుఫ్ ఖాన్. తనకు ఆంగ్లంలో ఉన్న ప్రావీణ్యంతో ఓ శాండ్విచ్ స్టాల్ ను పెట్టుకుని సంపాదించిన 5వేల రూపాయల డబ్బుతో ముంబయికి పయనమయ్యాడు.
దేవికారాణీ సూచనలో తొలి అడుగులు..
1943లో తన తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటంతో యూసుఫ్ ఖాన్ మళ్లీ ఉద్యోగం చేయటం అనివార్యమైంది. అలా తనకి ఉన్న పరిచయాలతో మలాడ్ లో బాంబే టాకీస్ లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అన్న ఆశతో యూసుఫ్ ఖాన్ వెళ్లాడు. అక్కడే బాంబే టాకీస్ యజమాని, ప్రముఖ నటి దేవికారాణి పరిచయం ఏర్పడింది. ఉద్యోగం కోసం అడిగిన యూసుఫ్ ఖాన్ ను సినిమాల్లో నటించాల్సిందిగా దేవికారాణి సూచించారు. నెలకు 1250 రూపాయలు వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వటంతో ఆశ్చర్యపోయిన యూసుఫ్ ఖాన్ అనుకోకుండా నటన వైపు అడుగులు వేశారు. దేవికారాణినే యూసుఫ్ ఖాన్ పేరును దిలీప్ కుమార్ గా మార్చారు. ప్రముఖ నటుడు అశోక్ కుమార్, నిర్మాత శశిధర్ ముఖర్జీ పరిచయంతో దిలీప్ కుమార్ సినిమా అవకాశాలు ఊపందుకున్నాయి. ప్రత్యేకించి అతనిలోని సహజ నటనను ఎప్పటి వదులుకోవద్దని అశోక్ కుమార్...దిలీప్ కుమార్ కు పదే పదే సూచించే వారట. అలా నటనపై పట్టు సాధించిన దిలీప్ కుమార్ ను బాంబే టాకీస్ నిర్మాణ సారధ్యంలో 1944 లో రూపొందిన 'జ్వర్ భాటా' లో దిలీప్ కుమార్ తొలిసారిగా నటుడిగా అవకాశం దక్కించుకున్నారు.
నట ప్రస్థానం సాగిందిలా...
తొలి చిత్రం అనంతరం 1945లో ప్రతిమ,1947లో నౌకా డూబీ చిత్రంలో నటించినా దిలీప్ కుమార్ కు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఆ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. 1947లో వచ్చిన జుగ్ను చిత్రం దిలీప్ కుమార్ కెరీర్ లో మైలురాయి. అక్కడి నుంచి దిలీప్ కుమార్ శకం ఆరంభమైంది. 1948 లో విడుదలైన షహీద్ చిత్రంతో దిలీప్ కుమార్ స్టార్ గా మారిపోయాడు. అఫ్పుడే ప్రముఖ నటి కామినీ కౌశల్ తో దిలీప్ కుమార్ కు పరిచయం ఏర్పడింది. షహీద్ చిత్రంతో విజయవంతమైన జంటగా వారిద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నదియా కేపార్, షబ్నం, అర్జూ వంటి హిట్ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.
లక్కీ మస్కట్గా..
1949లో తొలిసారిగా తన బాల్యమిత్రుడు రాజ్ కపూర్ తో కలిసి నటించాడు దిలీప్ కుమార్. అంతకు ముందుకు 11 చిత్రాలు ఫ్లాప్ కావటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉన్న రాజ్ కపూర్ తో కలిసి రొమాంటిక్ మెలో డ్రామా అందాజ్ లో దిలీప్ కుమార్ నటించారు. ఈ మల్టీ స్టారర్ అత్యద్భుతమైన విజయం సాధించి రాజ్ కపూర్ కెరీర్ కి మళ్లీ ఊపిర్లు ఊదింది. అచ్చం రాజ్కపూర్ లానే దేవానంద్ కు 1946-47 లో మూడు సినిమాలు వరుస పరాజయం పాలయ్యాయి. ఈ తరుణంలో 1948 దేవానంద్ తో కలిసి జిద్దీ సినిమాలో నటించారు దిలీప్ కుమార్. ఆ చిత్రం భారీ సక్సెస్ సాధించటంతో దిలీప్ కుమార్ అందరికీ అదృష్టంలా మారిపోయారు. ఆ రోజుల్లో దిలీప్ కుమార్ ను లక్కీ మస్కట్ అని పిలుచుకునేవారు. 1950ల నాటికి హిందీ సినిమా అంటే దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ ల పేర్లే వినిపించేవి. ఆ స్థాయిలో ప్రేక్షకుల హృదయాల్లో తమ నటనతో స్థానం సంపాదించారు ఈ ముగ్గురు దిగ్గజ నటులు.
ట్రాజెడీ హీరోగా గుర్తింపు..
ట్రాజెడీ హీరో గా మిగిలిన హీరోలకి లేని వైవిధ్యమైన గుర్తింపు దిలీప్ కుమార్ మాత్రమే దక్కింది. విషాదాంతంగా ముగిసే పాత్రల్లో తనకు సాటి మరెవరూ లేరనే విధంగా దిలీప్ కుమార్ నటించేవారు. 1948లో నదియా కే పార్ తో మొదలు పెడితే మేలా, అందాజ్, జోగన్, బబుల్, అర్జూ, దీదర్, తరానా, దాగ్, శిఖస్త్ సినిమాల్లో విషాధ ఛాయలున్న పాత్రలు పోషించి ట్రాజెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు దిలీప్ కుమార్. ఆ పేరు ను మరో మెట్టెక్కిస్తూ 1954లో వచ్చిన అమర్, 1955లో వచ్చిన దేవదాస్, 1958లో వచ్చిన మధుమతి, 1966లో నటించిన దిల్ దియా దర్ద్ లియా, 1968 లోని ఆద్మీ చిత్రాల్లో నటించారు దిలీప్ కుమార్. ప్రత్యేకించి శరత్ చంద్ర రాసి దేశంలో పలు భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం దేవదాస్ లో దిలీప్ కుమార్ నటన జీవిత కాలపు అనుభూతిని స్తుంది అనే పేరును ఆయన సంపాదించాడు. భగ్న ప్రేమికుడిగా కళ్లతోనే విషాదాన్ని చిలికిస్తూ దిలీప్ చూపిన హావభావాలు, ఆయన మెథడ్ యాక్టింగ్ నటన అనే పదానికి నిర్వచనంగా చరిత్రలో నిలిచిపోయాయి. విపరీతంగా ట్రాజెడీ రోల్స్ చేయటం వలన ఆయన మానసికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో విషాదపాత్రలో పోషించటం మానేయాలని లేదా సినిమాలు వదిలేయాలని వైద్యులు సూచించటంతో...ఆందోళనకు లోనైన దిలీప్ కుమార్ తన పంథా మార్చి తనలోని మరో కొత్త నటుడి కోసం వెతుక్కున్నారు.