కస్తూరి శివరావు.. రంగస్థలం నుంచి వెండితెర వరకు ఎందరినో తన హాస్య ప్రతిభతో మెప్పించిన నటుడు. 1913లో పుట్టిన ఆయన వెండితెరకు పరిచయం కాకముందు వ్యాఖ్యాతగా ఆకట్టుకున్నాడు. తర్వాత రీళ్ల తెరపై ప్రొజెక్టరు ఆపరేటరుగా పనిచేశాడు. చివరికి బిగ్ స్క్రీన్పై నటుడిగా స్థిరపడ్డాడు. మాస్ ఫాలోయింగ్కు పక్కా అడ్రస్గా మారిన ఆయన.. 1948లో విడుదలైన 'బాలరాజు' సినిమాతో స్టార్ అయ్యాడు.
తను నటించిన సినిమాల నూరురోజుల పండగలకి ఊళ్లు వెళ్లేవాడు శివరావు. వేలాది మంది అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడేవారు. ఒకానొక సమయంలో టాప్ హీరోలతో సమానంగా పేరు తెచ్చుకున్నాడు. చేతి నిండా ఆఫర్లతో ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవాడు శివరావు.
ఆస్తి మొత్తం ఏమైందో...!
మద్రాసులో ఇల్లు కట్టుకుని స్థిరపడిన ఆయన.. పెద్ద విదేశీ కార్లో తిరిగేవాడు. సొంతంగా పరమానందయ్య శిష్యులు’ (1950) చిత్రానికి దర్శకత్వం వహించి.. దాన్ని నిర్మాతగానూ వ్యవహరించాడు. ఆ సినిమాను ప్రేక్షకులూ బాగానే ఆదరించారు.
కాలక్రమేణా శివరావుకి సినిమాలు తగ్గాయి. సంపాదించుకున్నదంతా ఏమైందో తెలీదు కానీ తాను విదేశీ కారులో తిరిగిన అదే పాండీ బజార్లో... డొక్కు సైకిలు మీద తిరిగే పరిస్థితికి దిగజారాడు. కెరీర్ మొదట్లో ఎంతో ఎదిగిన ఆయనకు చివరికి అవకాశాలు కరవయ్యాయి. అడుక్కోలేక జీవనోపాధికి నాటకాలు వేసేవాడు.1966లో ఓరోజు అలా తెనాలి వెళ్లిన ఆయన.. అక్కడే మరణించాడు. మూడు రోజుల తర్వాత శివరావు పార్దీవదేహం మద్రాసు చేరుకుంది. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి తీసుకొచ్చారు.
తారగా వెలిగినపుడు వేలాదిమందిని తన వెంట తిప్పుకున్న శివరావు అంతిమయాత్ర హృదయ విదారకంగా జరిగింది. ఆయన వెంట శ్మశానానికి వెళ్లడానికి నలుగురు మనుషులు కూడా కరవయ్యారు. దీనంతటి వెనుక కారణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. కొందరు మాత్రం సృయంకృతాపరాధమని అంటుంటారు.