ఈ రోజుల్లో ఎంత పెద్ద హీరో సినిమా అయినా వంద రోజులు ఆడటం గొప్పగా మారింది. ఒకవేళ అంతటి ఘనవిజయం సాధించాలంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉండాల్సిందే. తాజాగా అలాంటి ఘనతే సొంతం చేసుకున్నాడు తమిళ కాదల్ మన్నన్ అజిత్. ఆయన నటించిన 'విశ్వాసం' సినిమా శతదినోత్సవ సంబురాలు చేసుకుంటోంది.
జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. తమిళనాడులోని పలు థియేటర్లలో ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదలైంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.
ప్రస్తుతం అజిత్ 'పింక్' రీమేక్గా వస్తోన్న 'నెర్కొండ పార్వాయి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'ఖాకీ' ఫేం హెచ్ వినోద్ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మాత. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.