Whatsapp admin rights : గ్రూపులలో అభ్యంతరకర సందేశాలు, నకిలీ వార్తల కట్టడికి సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్ మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. గ్రూప్లోని సభ్యుల సందేశాలను తొలగించే ఆప్షన్ను అడ్మిన్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇంతవరకు వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా సభ్యుడు అభ్యంతరకర సందేశాన్ని పోస్టు లేదా షేర్ చేస్తే... దాన్ని అతను తప్ప గ్రూప్ అడ్మిన్ తొలగించటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గ్రూప్లోని సభ్యుడెవరైనా అభ్యంతరకర సందేశాన్ని పోస్టు చేసినా లేదా షేరింగ్ చేసినా దాన్ని గ్రూప్ నుంచి అడ్మిన్ తొలగించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.... త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.
ఇలా పనిచేస్తుంది
గ్రూపు సభ్యులు పోస్ట్ లేదా షేర్ చేసిన మెసేజ్ను అడ్మిన్ సెలెక్ట్ చేస్తే చాట్ పేజీపైన డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిలీట్ ఫర్ మీ, క్యాన్సిల్ అని 3ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ సెలెక్ట్ చేస్తే సదరు మెసేజ్ గ్రూపు నుంచి డిలీటవుతుంది. సదరు మెసేజ్ అడ్మిన్ తొలగించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల గ్రూపులో అభ్యంతరకరమైన మెసేజ్లతోపాటు, నకిలీ వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్ చెబుతోంది.