తెలంగాణ

telangana

మాట్లాడితే చాలు.. కరోనా ఫలితం వచ్చేస్తుంది!

By

Published : Jun 7, 2021, 7:08 PM IST

కరోనా నిర్ధరణ కోసం ఆర్​టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల కుక్కల ద్వారా కొవిడ్​ను గుర్తిస్తున్నారు. తాజాగా ఓ వినూత్న పద్ధతిని బెంగళూరు ఐఐఎస్​సీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాట్లాడితే కరోనా ఫలితం వచ్చేలా సాంకేతికతను రూపొందించారు. అదెలా పనిచేస్తుందంటే...

COSWARA
కోస్వర

దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు(ఐఐఎస్​సీ).. ఆవిష్కరణల్లో ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో వినూత్న సాంకేతికతను రూపొందించింది.

విద్యా సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్ సహాయ ఆచార్యులు డాక్టర్. శ్రీరాం గణపతి.. స్వర గుర్తింపు(voice recognition) ఆధారంగా కొవిడ్ బాధితులను గుర్తించేలా సాంకేతికత అభివృద్ధి చేశారు. దీనికి 'కోస్వర' అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... సాంకేతికత పనితీరును వివరించారు.

ఇంటర్వ్యూ

కోస్వర అంటే ఏంటి? కొవిడ్ సంబంధిత ఇన్​ఫెక్షన్లను ఇది ఎలా గుర్తిస్తుంది?

కొవిడ్, స్వర అనే పదాల కలయికే కోస్వర. స్వర అంటే శబ్దం. శబ్దం ఆధారంగా కొవిడ్​ను గుర్తించే విధానం ఇది. దీన్ని ఉపయోగించేవారు స్మార్ట్​ఫోన్​ లేదా ఇంటర్నెట్ ఉన్న ఇతర డివైజ్​ల ద్వారా తమ స్వర నమూనాను అప్​లోడ్ చేయాలి. మాటలతో పాటు ఊపిరి తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు వచ్చే శబ్దాలను ఇందులో అప్​లోడ్ చేయాలి. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సూచించే వివరాలు అందించాలి. ఈ సమాచారం రిమోట్ సర్వర్లకు చేరుతుంది. మేం తయారు చేసిన అల్గారిథం ద్వారా ఈ సమాచారాన్ని విశ్లేషిస్తాం. అది కరోనా సోకిన వ్యక్తిదా కాదా అని గుర్తిస్తాం.

కంప్యూటర్ లేదా సాఫ్ట్​వేర్లు స్వర నమూనాలను పరిశీలించి వ్యాధిపై ఎలా నిర్ధరణకు వస్తాయి?

ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డ తర్వాత.. వారి శ్వాసకోశంలో ఆ వైరస్ అభివృద్ధి చెందుతుంది. నోరు, ముక్కు ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుతుంది. సీటీ స్కాన్, ఎక్స్​ రే వంటి పద్ధతులు కరోనా లక్షణాలను గుర్తిస్తాయి. ఇదే విధంగా మా సాంకేతికత పనిచేస్తుంది. బాధితుల స్వరంలో ఇన్​ఫెక్షన్ వల్ల మార్పులు సంభవిస్తాయి. శ్వాసకోశ వ్యవస్థలో వివిధ అవయవాల సమన్వయంతోనే శబ్దాలు బయటకు వస్తాయి. శ్వాసకోశ వ్యవస్థలోని అవయవాల్లో ఏవైనా ఇన్​ఫెక్షన్లు ఉంటే.. ఆయా అవయవాలు ఉత్పన్నం చేసే శబ్దాలు మారిపోతాయి. కరోనా బాధితులు దగ్గినప్పుడు ఆ శబ్దంలోని ప్రకంపన స్వభావం భిన్నంగా ఉంటుంది. బాధితుల నమూనాలు, ఆరోగ్యంగా ఉన్న వారి నమూనాలను సేకరించి.. వాటి మధ్య తేడాలను గుర్తించే విధంగా కంప్యూటర్ అల్గారిథం తయారు చేస్తే సరిపోతుంది.

కోస్వర అభివృద్ధి చేయడానికి ఎన్ని స్వర నమూనాలను సేకరించారు?

వలంటీర్ల సహకారంతో సుమారు 2 వేల నమూనాలను సేకరించాం. వీరందరికీ మా కృతజ్ఞతలు. మరిన్ని నమూనాలు అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. coswara.iisc.ac.in వెబ్​సైట్ ద్వారా నమూనాలు ఇవ్వొచ్చు. వ్యక్తిగత డేటాను సేకరించడం లేదు. కోస్వర సాంకేతికతను మరింత మెరుగుపర్చేందుకే ఈ నమూనాలను వినియోగిస్తాం. డేటా ఎక్కువ ఉంటే కచ్చితత్వాన్ని పెంచవచ్చు.

కోస్వర ఎంత కచ్చితత్వంతో పనిచేస్తుంది?

మా డేటా ప్రకారం ఇది దాదాపు 93 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది. దీనిపై పీర్ రివ్యూ జరుగుతోంది. కచ్చితత్వం అనేది రెండు రకాలుగా ఉంటుంది. కొవిడ్ ఉందన్న విషయాన్ని గుర్తించడం, కొవిడ్ లేదన్న విషయాన్ని గుర్తించడం. కోస్వర వంటి పరికరాలకు సంబంధించి ఐసీఎంఆర్ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం కచ్చితత్వానికి సంబంధించి రెండింటికీ నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి.

2021 మే నాటి ప్రమాణాల ప్రకారం.. నెగెటివ్​ నమూనాలను 95 శాతం కచ్చితత్వంతో గుర్తించాలి. పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ నమూనాలకు సంబంధించి 50 శాతం కన్నా ఎక్కువ సెన్సిటివిటీ ఉండాలి. కోస్వర.. 95 శాతం, 69 శాతం సెన్సిటివిటీని సాధించింది. పాయింట్ ఆఫ్ కేర్ టూల్​కు సంబంధించి 19 శాతం అధికంగా సెన్సిటివిటీని సాధించాం.

కోస్వరను విస్తృత వాడకంలోకి తెచ్చేందుకు పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారా?

ఈ టూల్ అభివృద్ధి కోసం ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదింపులు జరిపాం. కోస్వర.. నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఓ మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి కోసం పరిశ్రమ సాయం కోరతాం. రిమోట్ టెస్టింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ఇందులో పాల్గొనేలా కేంద్రీకృత విధానాన్ని తీసుకొస్తాం. ఇందుకోసం పరిశ్రమ వర్గాల సహకారం అవసరం.

ఇదీ చదవండి-ఇస్రో వెంటిలేటర్లు- ఎవరైనా తయారు చేయొచ్చు!

ABOUT THE AUTHOR

...view details