దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు(ఐఐఎస్సీ).. ఆవిష్కరణల్లో ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో వినూత్న సాంకేతికతను రూపొందించింది.
విద్యా సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సహాయ ఆచార్యులు డాక్టర్. శ్రీరాం గణపతి.. స్వర గుర్తింపు(voice recognition) ఆధారంగా కొవిడ్ బాధితులను గుర్తించేలా సాంకేతికత అభివృద్ధి చేశారు. దీనికి 'కోస్వర' అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... సాంకేతికత పనితీరును వివరించారు.
కోస్వర అంటే ఏంటి? కొవిడ్ సంబంధిత ఇన్ఫెక్షన్లను ఇది ఎలా గుర్తిస్తుంది?
కొవిడ్, స్వర అనే పదాల కలయికే కోస్వర. స్వర అంటే శబ్దం. శబ్దం ఆధారంగా కొవిడ్ను గుర్తించే విధానం ఇది. దీన్ని ఉపయోగించేవారు స్మార్ట్ఫోన్ లేదా ఇంటర్నెట్ ఉన్న ఇతర డివైజ్ల ద్వారా తమ స్వర నమూనాను అప్లోడ్ చేయాలి. మాటలతో పాటు ఊపిరి తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు వచ్చే శబ్దాలను ఇందులో అప్లోడ్ చేయాలి. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సూచించే వివరాలు అందించాలి. ఈ సమాచారం రిమోట్ సర్వర్లకు చేరుతుంది. మేం తయారు చేసిన అల్గారిథం ద్వారా ఈ సమాచారాన్ని విశ్లేషిస్తాం. అది కరోనా సోకిన వ్యక్తిదా కాదా అని గుర్తిస్తాం.
కంప్యూటర్ లేదా సాఫ్ట్వేర్లు స్వర నమూనాలను పరిశీలించి వ్యాధిపై ఎలా నిర్ధరణకు వస్తాయి?
ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డ తర్వాత.. వారి శ్వాసకోశంలో ఆ వైరస్ అభివృద్ధి చెందుతుంది. నోరు, ముక్కు ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుతుంది. సీటీ స్కాన్, ఎక్స్ రే వంటి పద్ధతులు కరోనా లక్షణాలను గుర్తిస్తాయి. ఇదే విధంగా మా సాంకేతికత పనిచేస్తుంది. బాధితుల స్వరంలో ఇన్ఫెక్షన్ వల్ల మార్పులు సంభవిస్తాయి. శ్వాసకోశ వ్యవస్థలో వివిధ అవయవాల సమన్వయంతోనే శబ్దాలు బయటకు వస్తాయి. శ్వాసకోశ వ్యవస్థలోని అవయవాల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే.. ఆయా అవయవాలు ఉత్పన్నం చేసే శబ్దాలు మారిపోతాయి. కరోనా బాధితులు దగ్గినప్పుడు ఆ శబ్దంలోని ప్రకంపన స్వభావం భిన్నంగా ఉంటుంది. బాధితుల నమూనాలు, ఆరోగ్యంగా ఉన్న వారి నమూనాలను సేకరించి.. వాటి మధ్య తేడాలను గుర్తించే విధంగా కంప్యూటర్ అల్గారిథం తయారు చేస్తే సరిపోతుంది.
కోస్వర అభివృద్ధి చేయడానికి ఎన్ని స్వర నమూనాలను సేకరించారు?