'తగినంత పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడం ద్వారా ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించడం'- జాతీయ ఆహార భద్రత చట్టం నిర్దేశించిన సమున్నత లక్ష్యం. నెలకు తలసరి నిర్దిష్ట పరిమాణంలో సరఫరాల ద్వారా ఆహార భద్రత ఒనగూడుతుందనుకొంటున్న ప్రభుత్వం- ఇతర ఆహార ఉత్పాదనల్లో నాణ్యతను పట్టించుకోకుండా ఆరోగ్య భద్రతను పణం పెడుతోందన్నది వాస్తవం. వంట నూనెలు, వనస్పతి, కృత్రిమ నవనీతం వంటి వాటిలో ఉండే సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు (టీఎఫ్ఏ) ప్రాణాంతకంగా మారి ఏటా ప్రపంచవ్యాప్తంగా 5.4 లక్షలమంది అర్ధాంతర మరణాలకు కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ కొన్నేళ్లుగా మొత్తుకొంటోంది.
టీఎఫ్ఏల కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయన్న ఆరోగ్య సంస్థ- 2023కల్లా వాటి వినిమయాన్ని ప్రపంచ దేశాలన్నీ పూర్తిగా మానేయాలని గట్టిగా సూచించింది. పారిశ్రామికంగా ఉత్పత్తి అయ్యే ప్రమాదభరిత కొవ్వు పదార్థాల స్థానే వినియోగించగల ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ వడివడిగా వాటి దిశగా మళ్లేందుకు 'రిప్లేస్' పేరిట ఆరు సూత్రాల కార్యాచరణను ప్రకటించింది. తదనుగుణ చర్యలకు సిద్ధం కావాలంటూ 2018లోనే ఆహార పరిశ్రమవారికి కేంద్రం తేల్చిచెప్పింది. వంట నూనెలు, వనస్పతి వంటి వాటిలో టీఎఫ్ఏ ఈ ఏడాది మూడు శాతానికి, వచ్చే సంవత్సరం రెండు శాతానికి పరిమితం కావాలని ఆహార భద్రత ప్రమాణాల సంస్థ తాజాగా గిరిగీసింది.
నూనెలు, కొవ్వుపదార్థాల్లో టీఎఫ్ఏ పరిమితి 10శాతంగా 2011లో నిర్ధారించిన ప్రభుత్వం, 2015లో దాన్ని అయిదు శాతానికి తగ్గించడం తెలిసిందే. టీఎఫ్ఏపై ఆంక్షల కొరడా ఝళిపించిన తొలి దేశమైన డెన్మార్క్లో ఆర్థిక సహకార అభివృద్ధి సంఘ (ఓఈసీడీ) దేశాలతో పోలిస్తే గుండె సంబంధ వ్యాధి మరణాలు వేగవంతంగా తగ్గిపోవడం గమనార్హ విశేషమే. ఈ పరిస్థితుల్లో జనారోగ్య భద్రత రీత్యా సత్వరం టీఎఫ్ఏ నిషేధం దిశగా అడుగులు కదపాల్సింది పోయి, క్రమానుగత తగ్గింపులు ఎవరిని ఉద్ధరించడానికి?