జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాలను పునర్విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇప్పటిదాకా నియోజక వర్గాల పునర్విభజనకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి. ఇకపైనా అదే విధానం అవలంబిస్తే మరోసారి ఈ రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని మద్రాస్ హైకోర్టు ముందుచూపుతో పేర్కొంది. గతంలో చేపట్టిన పునర్విభజన కారణంగా తమిళనాడు రెండు, ఏపీ ఒక లోక్సభ స్థానం కోల్పోయాయి.
60-70వ దశకంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు జనాభా వృద్ధిరేటు బాగా మందగించింది కాబట్టి మరిన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు తక్కువగా ఉండటం వల్ల ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ జనాభాలో భారీ తగ్గుదల నమోదయ్యే సూచనలున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం సిఫార్సులకు జనాభాను ప్రధాన కొలమానంగా తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రాలు బాగా నష్టపోయాయి. ఇప్పుడు అదే సూత్రాన్ని నియోజక వర్గాల సంఖ్యకూ వర్తింపజేస్తే రాజకీయంగా ప్రాబల్యం కోల్పోవడం తథ్యం.
ప్రాతినిధ్యానికి విలువ
దేశంలో ఇప్పటిదాకా 1952, 1963, 1973ల్లో అప్పటి జనాభా లెక్కల ప్రకారం చట్టసభ స్థానాలను పునర్విభజించారు. దాని ప్రకారం లోక్సభ స్థానాలు 494, 522, 543కు చేరాయి. ప్రతి సీటుకు సమాన జన సంఖ్య ఉండాలన్న ప్రాతిపదికన అప్పట్లో నియోజక వర్గాలను విభజించారు. అయితే 1976లో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 జనాభా లెక్కల వరకు తదుపరి లోక్సభ, అసెంబ్లీ సీట్లు పెంచకూడదనే నిబంధన విధించారు. దేశంలో అప్పుడప్పుడే కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చినందువల్ల, అది ఒక క్రమరూపాన్ని సంతరించుకొని రాష్ట్రాల్లో జనాభా వృద్ధిరేటులో స్థిరత్వం రావడానికి కనీసం పాతికేళ్లయినా పడుతుందన్న ఉద్దేశంతో 2001 వరకు నియోజక వర్గాల పునర్విభజన చేపట్టకూడదని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరవాతా జనాభా వృద్ధిరేటు విషయంలో రాష్ట్రాల మధ్య సమతౌల్యం రాకపోవడంతో నియోజక వర్గాల పెంపును 2026 వరకు వాయిదా వేస్తూ 2002లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 2026 తరవాత చేపట్టే తొలి జనాభా లెక్కల ఆధారంగా దేశంలోని చట్టసభల్లో సీట్లు పెంచాలని చెబుతూ అధికరణ 170కి ఆ మేరకు సవరణ చేశారు.
2026 తరవాత తొలి జనాభా లెక్కలంటే 2031లో చేపట్టేవే. ఇప్పుడున్న వరస క్రమం ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2024, 2029, 2034, 2039లో జరుగుతాయి. 2031 జనాభా లెక్కలన్నీ క్రోడీకరించి ప్రచురించడానికి రెండు మూడేళ్లు పడుతుంది కాబట్టి 2034 ఎన్నికల నాటికి నియోజక వర్గాల పునర్విభజన చేసే అవకాశం ఓ మోస్తరుగా ఉంటుంది. అది తప్పితే 2039లో ఖాయమవుతుంది. ఈ క్రమంలో దాదాపు 13-18 ఏళ్ల తరవాత తలెత్తే రాజకీయ విపత్తు గురించి మద్రాస్ హైకోర్టు ఇప్పుడే అప్రమత్తం చేసింది. నియోజక వర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ సీట్లు తగ్గిపోతే రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలెక్టోరల్ కాలేజీలో దక్షిణాది రాష్ట్రాల సంఖ్యాబలం తగ్గి, వాటి ప్రాతినిధ్యానికి విలువ లేకుండా పోయే ప్రమాదం ఉంది.
జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉంటుందో 2002లో ఏర్పాటైన జస్టిస్ కుల్దీప్సింగ్ కమిషన్ సిఫార్సులు స్పష్టం చేశాయి. ఆ కమిషన్ సీట్ల సంఖ్య పెంపు జోలికి పోకపోయినా- రాష్ట్రాల్లో అంతర్గతంగా నియోజక వర్గాల సరిహద్దులను పునర్విభజించింది. ఆ సూత్రం కారణంగా స్థానికంగా జనాభా పెరిగిన ప్రాంతాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగి, జనాభా తగ్గిన ప్రాంతాలు నష్టపోయాయి. అందుకు ఉదాహరణ ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీట్లు పెరగడమే.
వలస కారణంతో..