కొవిడ్ మహమ్మారికి ముకుతాడు వేసేందుకు పలు టీకాలు అందుబాటులోకి రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. వ్యాపార వాణిజ్యాలు తిరిగి వేగం పుంజుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థను సత్వరం సాధారణ స్థాయికి తెచ్చేందుకు వీలుగా భారత్ తాజా విధానాలు రూపొందిస్తోంది. వృద్ధిరేటును పరుగులు తీయించేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈ లక్ష్య సాధనకు స్థూల ఆర్థిక అంశాలతో పాటు, వాణిజ్యం పాత్రా కీలకం. అందుకని వాణిజ్య విధానాలకు కొత్త రూపు ఇవ్వాలి. మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో ఇది మరింత ముఖ్యం. మనం ఎప్పటినుంచో కోరుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొత్త కోణం నుంచి పరిశీలించాలి.
మన దేశానికి లాభసాటేనా?
ప్రపంచీకరణకు దోహదపడిన ప్రధాన చోదక శక్తుల్లో ఒకటైన స్వేచ్ఛా వాణిజ్యం పలు అంతర్జాతీయ విపణులను ఏకం చేసింది. మిగులు ఉత్పత్తులను సరసమైన ధరలకు ఎగుమతి చేయడం, కొరత వస్తువులను చవకగా దిగుమతి చేసుకోవడం ఆయా దేశాలకు సాధ్యమైంది. స్వేచ్ఛా వాణిజ్యం నెరపే దేశాలు తమ ఎగుమతులు గణనీయంగా పెంచుకోగలిగాయి. అయితే నాణానికి రెండో పార్శ్వం కూడా ఉంటుంది. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా భూమి, శ్రమ, పెట్టుబడి, మౌలిక వనరులు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. సాంకేతికత, ఇతర ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వ్యవస్థ వంటి అంశాలూ దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వీటికి అనుగుణంగా ఉత్పాదకత స్థాయి, సరకుల ధరలు దేశాన్ని బట్టి మారతాయి. దీంతో- చవకగా ఉత్పత్తి చేసి తక్కువ ధరలకు ఎగుమతి చేసే దేశాలకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు) లాభసాటి అని, దిగుమతి చేసుకునే దేశాలకు అవి నష్టదాయకమని చాలా దేశాలు భావిస్తున్నాయి.
వాణిజ్య విధానంలో..
భారత్ విషయానికి వస్తే- స్వేచ్ఛా వాణిజ్యం వల్ల సంస్కరణల అనంతర కాలంలో దేశం లబ్ధి పొందినప్పటికీ, రెండో వాదన కూడా చాలాసార్లు నిజమవుతోంది. ఆసియాన్, జపాన్, కొరియాలతో భారత్కు ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనే ఉదాహరణగా తీసుకుంటే- దేశం మొత్తం ఎగుమతుల్లో ఈ విపణుల వాటా గత పదేళ్లలో 51 శాతం నుంచి 46 శాతానికి పడిపోయింది. అంటే, ఎఫ్టీఏలు ఉన్నప్పటికీ భారత్ ఈ దేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయలేకపోయింది. అదే సమయంలో, భారత్ ఎగుమతుల్లో ఐరోపా యూనియన్, అమెరికాల వాటా 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. వీటితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు లేనప్పటికీ ఇది సాధ్యపడింది. 2018లో భారత్ ఈ దేశాలతో జరిపిన వాణిజ్యంలో 12.7 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు సాధించింది. స్వేచ్ఛా వాణిజ్య విధానంలో మన వైఖరిని పునః సమీక్షించుకోవలసిన అవసరాన్ని ఈ ధోరణులు సూచిస్తున్నాయి.
అర్థం చేసుకోవాలి
స్వేచ్ఛా వాణిజ్యంతో మనకు ప్రయోజనాలతోపాటు ప్రతిగా మనం చెల్లించాల్సిన మూల్యాలూ ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛా వాణిజ్యంలో దేశాల జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. పోటీ పడగలిగిన సత్తా ఉన్నప్పుడే, అంతర్జాతీయ వాణిజ్య సంప్రదింపుల్లో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ప్రపంచ సరఫరాల గొలుసులో దేశాన్ని ఒక ముఖ్యమైన అనుసంధానంగా మార్చగలిగితేనే ఇది సాధ్యపడుతుంది. ఇందుకోసం, పరిశ్రమల సమర్థతను పెంచి వాటి ఉత్పాదకతను హెచ్చించే దిశగా సంస్కరణలు చేపట్టి పారిశ్రామిక రంగం మొత్తాన్ని ప్రక్షాళన చేయడం తప్పనిసరి. మరోవైపు దేశ ఎగుమతుల రంగానికి ఊపునిచ్చేలా మౌలిక సదుపాయాల అవరోధాలను తొలగించాలి. ఎగుమతుల ప్రోత్సాహానికి వీలుగా పెట్టుబడుల నిబంధనలను మరింతగా సడలించాలి.