శిరీష బండ్ల స్వస్థలం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు. తండ్రి బండ్ల మురళీధర్, తల్లి అనురాధ ఇద్దరూ యూఎస్ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్. శిరీషకు ఆరేళ్లున్నప్పుడు వీళ్ల కుటుంబం టెక్సాస్లోని హోస్టన్కి మారిపోయింది. వాళ్లకి దగ్గర్లో ఓ స్పేస్ సెంటర్ ఉండేది. ఓసారి అక్కడికి వెళ్లినపుడు అది ఆమెను బాగా ఆకట్టుకుంది. అప్పట్నుంచి తరచూ వెళ్లేది. అల్లంత దూరానున్న నక్షత్రాల్నీ, చంద్రుడినీ అందుకునేందుకు ఆస్ట్రోనాట్ (Astronaut) అవ్వాలనుకుంది. ఎయిర్ఫోర్స్ కోర్సులు చదివి, పైలట్ అయితే తర్వాత నాసాలో అవకాశం పొందొచ్చన్నది ఆమె ప్లాన్. కానీ తనకు హైస్కూలు స్థాయిలో కంటి సమస్య వచ్చింది. పైలట్ లేదా ఆస్ట్రోనాట్ అవ్వడానికి కావాల్సిన కనీస అర్హత మంచి కంటి చూపు. దీంతో తను నిరుత్సాహపడింది.
ఇంటర్ సమయంలో ఒక ప్రైవేటు స్పేస్ టూరిజం (Private space tourism) సంస్థ గురించి తెలుసుకుంది. నాసా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అవకాశాలున్నాయని అప్పుడే అర్థమైందామెకు. మళ్లీ తన కలపై దృష్టిపెట్టింది. ఈసారి ఏరోస్పేస్ ఇంజినీరింగ్పై దృష్టిపెట్టింది. దాని ద్వారా కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నది ఆమె లక్ష్యం.
ప్రాక్టికల్గా నేర్చుకుంటూ..
శిరీషకు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంపై ఆసక్తి ఎక్కువ. తరగతిలో కంటే ప్రాక్టికల్గా ఎక్కువ తెలుసుకోవచ్చని నమ్ముతుంది. అందుకే ఇంజినీరింగ్ మొదటి ఏడాది మినహా మిగిలిన మూడేళ్లూ చదువుతూనే ఓ ఇంజినీరింగ్ సంస్థలో ఇంటర్న్గానూ పనిచేసింది. నైపుణ్యాలను నేరుగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుంది. ఇంజినీరింగ్ సమయంలోనే ‘జీరో గ్రావిటీ’లో ప్రయాణించే అవకాశమూ దక్కించుకుంది. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందగానే ఉద్యోగంలో చేరిపోయింది. అప్పుడే తనకు సాంకేతికాంశాలు తప్ప వ్యాపార అంశాల్లో పరిజ్ఞానం లేదని అర్థమైంది. దీంతో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి స్పేస్ ఇండస్ట్రీ (Space Industry)లో ఎంబీఏ చేసింది. తన ఆసక్తి తెలిసిన ప్రొఫెసర్ కమర్షియల్ స్పేస్ ఫెడరేషన్ (CSF) అనే సంస్థ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అక్కడ ఇంటర్వ్యూకు హాజరై ఎంపికైంది. అలా 2012లో తన కలల రంగంలోకి కాలూనింది.