కరోనా కారణంగా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సడలించింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న భారత్ సహా 15 దేశాల పౌరులను సెప్టెంబరు 12 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఏ దేశాలంటే..
సరైన నివాస వీసాలు ఉన్నవారు రెండు డోసులు వేసుకుంటే తిరిగి యూఏఈకి రావొచ్చని స్పష్టం చేసింది. భారత్తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, అఫ్గానిస్థాన్ దేశాల పౌరులకు అనుమతి కల్పిస్తున్నట్లు యూఏఈ ఆ ప్రకటనలో వెల్లడించింది.