భారత్-అఫ్గాన్ మైత్రికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1996-2001 మధ్య తాలిబన్ రాక్షస పాలన సాగిన సమయంలో ఈ స్నేహానికి బ్రేక్ పడింది. 2001లో ఆ మూకను అమెరికా తరిమికొట్టాక.. భారత్ తిరిగి అఫ్గాన్లో ప్రవేశించింది. 2011లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కింద అఫ్గాన్ మౌలిక వసతులు, సంస్థల పునర్నిర్మాణం, విద్య, సాంకేతిక సాయం, అఫ్గాన్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, అక్కడి ఉత్పత్తులపై ఎలాంటి సుంకం లేకుండానే భారత మార్కెట్లోకి అనుమతించడం వంటి వెసులుబాట్లను ఇచ్చింది. ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్యం వంద కోట్ల డాలర్లకు చేరింది. 400కుపైగా ప్రాజెక్టుల ద్వారా అఫ్గాన్లోని 34 ప్రావిన్స్లకూ భారత సాయం అందింది. ఆ దేశం మళ్లీ తాలిబన్ కోరల్లో చిక్కుకోవడంతో 20 ఏళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది.
చాబహార్ రేవు
ఇది ఇరాన్లోని సిస్టాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఉంది. దీన్ని భారత్, ఇరాన్ సంయుక్తంగా చేపడుతున్నాయి. అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా ప్రాంతానికి సముద్ర-రోడ్డు సంధానతను కల్పించడం దీని ఉద్దేశం.
జరాంజ్-డెలారం హైవే
దీని పొడవు 218 కిలోమీటర్లు. 15 కోట్ల డాలర్లతో భారత్కు చెందిన సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) దీన్ని నిర్మించింది. ఇది అఫ్గాన్-ఇరాన్ సరిహద్దుల్లోని జరాంజ్ వద్ద ప్రారంభమై ఖాష్ రడ్ నది మీదుగా డెలారం వరకూ సాగుతుంది. అక్కడ అది ఒక ముఖ్య రింగ్ రోడ్డుతో సంధానమైంది. ఆ రింగ్ రోడ్డు.. కాందహార్, ఘజ్నీ, కాబుల్, మజారే షరీఫ్, హెరాత్తో సంధానత కలిగి ఉంది.
తన భూభాగం గుండా అఫ్గాన్కు చేరుకునేందుకు పాక్ అనుమతినివ్వకపోవడంతో ఈ హైవే భారత్కు అక్కరకొచ్చింది. మన దేశం నుంచి తొలుత సముద్ర మార్గం గుండా ఇరాన్లోని చాబ్హార్ రేవుకు ఆ తర్వాత రోడ్డు మార్గంలో అఫ్గాన్లోని వివిధ ప్రాంతాలకు సరకులను చేరవేయడానికి ఈ హైవే ఉపయోగపడింది. గత ఏడాది కరోనా మహమ్మారి సమయంలో ఈ మార్గం గుండానే 75వేల టన్నుల గోధుమలను అఫ్గాన్కు భారత్ పంపింది. ఈ హైవే నిర్మాణంలో 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు ఉగ్రవాద దాడుల్లో బలయ్యారు. మన దేశం ఇంకా అనేక చిన్నపాటి రోడ్లనూ అక్కడ నిర్మించింది.
పార్లమెంట్ భవనం..
1996లో అఫ్గాన్ను ఆక్రమించే క్రమంలో నాటి పార్లమెంటు భవనం ‘దారుల్ అమన్’ను తాలిబన్లు బాంబులతో పేల్చేశారు. అఫ్గాన్లో ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు వేసేందుకు 9 కోట్ల డాలర్లతో కాబుల్లో పార్లమెంటు భవనాన్ని భారత్ నిర్మించింది. ఈ సౌధానికి మాజీ ప్రధాన మంత్రి ఎ.బి.వాజ్పేయీ పేరు పెట్టారు. 2015లో దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
బహుళ ప్రయోజన అఫ్గాన్-భారత్ మైత్రి డ్యామ్ (ఏఐఎఫ్డీ)
దీన్ని సల్మా డ్యామ్ అని కూడా అంటారు. హెరాత్లో ఇది ఉంది. ఎన్నో ఇబ్బందులను అధిగమించి 2016 జూన్లో ప్రారంభించారు. ఇందులోని జలవిద్యుత్ కేంద్రం 42 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. డ్యామ్ ద్వారా 75వేల హెక్టార్ల భూమికి సాగు నీరు అందుతుంది.
స్టార్ ప్యాలెస్
19వ శతాబ్దంలో కాబుల్లో నిర్మించిన ఈ ప్యాలెస్కు ఘన చరిత్ర ఉంది. అఫ్గాన్ స్వాతంత్య్రానికి ప్రాతిపదికగా నిలిచిన 1919 నాటి 'రావల్పిండి ఒప్పందం' ఇక్కడే కుదిరింది. 1965 వరకూ ఆ భవనంలో విదేశాంగ శాఖ కార్యాలయం ఉండేది. 2009లో దీని పునర్నిర్మాణానికి భారత్, అఫ్గాన్, అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2016లో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, భారత ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు.