తెలంగాణ

telangana

మారిషస్‌ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

By

Published : Jun 5, 2021, 4:31 AM IST

మారిషస్‌ మాజీ అధ్యక్షుడు సర్‌ అనిరుద్‌ జగన్నాథ (91) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Mauritius ex President
మారిషస్‌ మాజీ అధ్యక్షుడు

మారిషస్‌ మాజీ అధ్యక్షుడు సర్‌ అనిరుద్‌ జగన్నాథ్‌ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. ప్రస్తుతం మారిషస్‌ ప్రధానిగా ఉన్న ప్రవింద్‌ జగన్నాథ్‌ ఆయన కుమారుడే. అనిరుద్‌ను భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో గత ఏడాది సత్కరించింది. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రవింద్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గొప్ప నేతల్లో ఒకరిగా, రాజనీతిజ్ఞుడిగా అనిరుద్‌ను మోదీ అభివర్ణించారు.

1963లో రాజకీయాల్లోకి..

అనిరుద్‌ 1930 మార్చి 29న జన్మించారు. బ్రిటన్‌లోని లండన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. తర్వాత కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేశారు. 1963లో లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎన్నికవడంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. మారిషస్‌ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకుగాను లండన్‌లో 1965లో జరిగిన రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొన్నారు. చగోస్‌ ఆర్చిపెలాగో దీవికి వలస పాలన నుంచి విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ దీవి మారిషస్‌లో భాగమని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ప్రకటించడానికి ఆయన పోరాటమే ప్రధాన కారణం. అనిరుద్‌ 2003 నుంచి 2012 వరకు మారిషస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1982 నుంచి 2017 మధ్య ఆరుసార్లు ప్రధానిగా విధులు నిర్వర్తించారు. అనంతరం కుమారుడు ప్రవింద్‌కు మార్గం సుగమం చేస్తూ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి.

ప్రధాని మోదీ ట్వీట్


నేడు సంతాప దినం


అనిరుద్‌ జగన్నాథ్‌ మృతి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. శనివారం అధికారిక వినోద కార్యక్రమాలేవీ నిర్వహించబోమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి :అఫ్గాన్​ బలగాల దాడుల్లో 20 మంది తాలిబన్లు హతం!

ABOUT THE AUTHOR

...view details