తెలంగాణ

telangana

ETV Bharat / international

పైలట్ తప్పిదం వల్లే పాక్​ విమాన ప్రమాదం

గత నెలలో జరిగిన పాకిస్థాన్ విమాన ప్రమాద ఘటన సమయంలో ఏటీసీ సూచనల్ని పైలట్ పట్టించుకోలేదని ఆ దేశ పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక డాన్​ న్యూస్ పత్రికలో ప్రచురితమైంది.

By

Published : Jun 4, 2020, 3:33 PM IST

Updated : Jun 4, 2020, 5:49 PM IST

Crashed PIA plane's pilot did not follow ATC instructions: Pak aviation authority
'పైలట్ తప్పిదం వల్లే పాక్​ విమాన ప్రమాదం'

పాకిస్థాన్​ కరాచీలో జనావాసాల మధ్య కుప్పకూలిన విమాన ప్రమాద ఘటనకు పైలట్ తప్పిదమే కారణమని ఆ దేశ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ప్రమాదానికి ముందు ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోలర్​ రెండు సార్లు హెచ్చరించినా.. పైలట్​ పట్టించుకోలేదని నివేదికలో పొందుపరిచింది. ఈ విషయం డాన్​ న్యూస్ పేపర్​లో ప్రచురితమైంది.

మే 22న లాహోర్​ నుంచి బయలుదేరి కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్​ అవ్వాల్సిన పాక్​ జాతీయ విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు చిన్నారులు సహా 97 మంది మరణించారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

విమానాశ్రయానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు సాధారణంగా ఉండాల్సిన ఎత్తులో కంటే ఎక్కువ ఎత్తులో విమానం ఉందని విమానయాన శాఖ నివేదికలో తెలిపింది. ఎత్తు తగ్గించుకోవాలని ఏటీసీ సూచించినా.. పైలట్ వినిపించుకోలేదని పేర్కొంది. 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సిన ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తులో విమానం ఉందని.. మరోసారి సూచించినా పైలట్ పట్టించుకోలేదని వివరించింది.

మరోపైపు పాకిస్థాన్​ పైలట్ల సమాఖ్య మాత్రం ఈ నివేదికతో విభేదిస్తోంది. తక్కువ వివరాలను పొందుపరిచారని ఆరోపిస్తోంది.

అయితే విమానంలోని బ్లాక్​బాక్స్​లో ఉన్న డేటాను విజయవంతంగా డౌన్​లోడ్​ చేశామని, దానిని విశ్లేషించాల్సి ఉందని ఫ్రెంచ్​ బ్యూరో ఆఫ్​ ఎంక్వైరీ అండ్​ ఎనాలసిస్ ఫర్ సివిల్​ ఏవియేషన్​ సేఫ్టీ వెల్లడించింది. వాయిస్​ రికార్డులన్నీ లభ్యమైనట్లు తెలిపింది. దీనిని పరిశీలించిన అనంతరం అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Last Updated : Jun 4, 2020, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details