తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2020, 9:29 PM IST

Updated : Mar 1, 2020, 6:17 AM IST

ETV Bharat / international

‘కరోనా’ అనుమానితుడిని కాల్చి చంపిన ఉత్తరకొరియా

కొవిడ్​-19 సోకి ఉంటుందనే అనుమానంతో ఓ వాణిజ్య అధికారిని ఉత్తర కొరియాలో కాల్చి చంపారు. సదరు వ్యక్తి ఇటీవలే చైనా నుంచి స్వదేశానికి వచ్చాడు. ప్రజా స్నానాల గది దగ్గర అతడిని చూసిన అధికారులు నిర్బంధించారు. అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వచ్చాడని హతమార్చారు.

covid-19-suspect-shot-dead-in-north-korea
‘కరోనా’ అనుమానితుడిని కాల్చి చంపిన ఉత్తరకొరియా

ఉత్తరకొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో, అక్కడ పాలన ఎంత నిరంకుశంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొవిడ్‌-19(కరోనా కొత్త పేరు) వైరస్‌ అనుమానంతో ఓ వాణిజ్య అధికారిని నిర్బంధించారు. అయితే, నిబంధనలు ఉల్లంఘించి అతడు బయటకు వచ్చాడని అక్కడికక్కడే కాల్చిపారేశారట. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన ఓ వార్తపత్రిక కథనం ప్రచురించింది.

సదరు అధికారి ఇటీవలే చైనా నుంచి స్వదేశానికి వచ్చాడు. చైనాలో విజృంభించిన వైరస్‌ భయంతో అతడు ఉత్తరకొరియాకు తిరిగి రాగానే పర్యవేక్షణ పేరుతో నిర్బంధించారు. అయితే ఇటీవల అతడు ఓ ప్రజా స్నానాల గది దగ్గర కన్పించినందున వెంటనే అరెస్టు చేసిన అధికారులు అక్కడికక్కడే కాల్చి చంపినట్లు ఆ వార్తాకథనం పేర్కొంది. వైరస్‌ ఇతరులకు వ్యాపించేలా ప్రమాదకరంగా ప్రవర్తించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

తమ దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆ దేశాధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్​ కఠిన విధానాలు తీసుకొచ్చారు. చైనా నుంచి వచ్చిన వారిని, చైనీస్‌ ప్రజలను కలిసినవారిని నిర్బంధించమని ఉత్తర్వులు జారీ చేశారు. చైనాతో సరిహద్దులను కూడా మూసేశారు. ఈ నేపథ్యంలో సదరు వాణిజ్య అధికారి నిబంధనలు ఉల్లంఘించినందున అతడిని చంపినట్లు తెలుస్తోంది. అంతేగాక, చైనా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో ఉన్నత స్థాయి అధికారిని దేశం నుంచి బహిష్కరించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: భారత పర్యటనపై మెలానియా ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Mar 1, 2020, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details