తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2020, 5:42 PM IST

ETV Bharat / international

'భారత్​పై ఆధిపత్యం కోసం చైనా కుయుక్తులు!'

సరిహద్దుల్లో శాంతి కోసం భారత్​ చేస్తోన్న కృషికి చైనా సహకరించదని అమెరికాలోని ప్రముఖ పరిశీలన సంస్థ అభిప్రాయపడింది. చైనా ఆధిపత్యాన్ని సాధించేందుకు ఈ విధానాన్ని ఎంచుకుందని భావిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్​ను ఇరుకున పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని అంచనాకు వచ్చినట్లు తెలిపింది.

INDOCHINA-THINKTANK
భారత్​- చైనా

సరిహద్దుల్లో యథాతథ స్థితి నెలకొనేలా భారత్​ చేస్తోన్న దీర్ఘకాల ప్రయత్నాలకు చైనా పెద్దగా గౌరవం ఇవ్వటం లేదని అమెరికాకు చెందిన ఓ పరిశీలనా సంస్థ వెల్లడించింది. దక్షిణాసియా వ్యవహారాలపై నిఘా ఉంచే ఈ అగ్రశ్రేణి సంస్థ భారత్​- చైనా మధ్య సరిహద్దు సంక్షోభమే ఇందుకు నిదర్శనమని ఉద్ఘాటించింది.

మిగిలిన ఆసియా దేశాల దేశాల తరహాలో భారత్​పైనా ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తోందని కార్నేజీ ఎండోమెంట్​ ఫర్​ ఇంటర్నేషనల్ పీస్​ పరిశోధకుడు ఆష్లే టెల్లిస్​ అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుత పరిస్థితులను చూస్తే సరిహద్దుల్లో శాంతి కోసం భారత్​ చేస్తోన్న కృషిని చైనా గౌరవించటం లేదని అర్థమవుతోంది. లేదా చైనాకు దీటుగా భారత్​ ముందు జాగ్రత్త చర్యలైనా తీసుకుని ఉండాలి."

- ఆష్లే టెల్లిస్

ఆధిపత్యమే లక్ష్యం!

గతంలో చెలరేగిన ఉద్రిక్తతలను పరిశీలిస్తే.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివాదాలు నడుస్తున్నాయి. చైనా అత్యున్నత నాయకత్వం ఆమోదం లేకుండా ఈ పరిస్థితి తలెత్తదని దీనిని బట్టి స్పష్టమవుతోందని టెల్లిస్​ చెప్పారు.

జమ్ముకశ్మీర్ విషయంలో భారత్​ నిర్ణయాలను అవకాశంగా తీసుకుని హిమాలయ సరిహద్దుల్లో సైనిక విస్తరణకు చైనా పూనుకుందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా భారత్​ను సందిగ్ధంలో పడేసి చర్చల ద్వారా భారీ లాభం పొందాలని చైనా భావిస్తున్నట్లు తెలిపారు.

"ఈ విధంగా ఆధిపత్య పోరులో భాగంగా చైనా.. తన సలామి-స్లైసింగ్ స్ట్రాటజీ ద్వారా (దురాక్రమణ, ఒత్తిడి వ్యూహాలు) భారత్​ లక్ష్యంగా దాడులు చేస్తోంది. అగ్రరాజ్యంగా ఎదిగేందుకు భారత్​పై ఆధిపత్యం చెలాయించే వ్యూహమే ఇది.

ఇందులో చేదు నిజం ఏమిటంటే, భారత్​ తనదిగా చెబుతున్న భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన బలగాలను ఎప్పటికీ తొలగించదు. భారత్​ బలవంతంగా ఖాళీ చేయిస్తే లేదా వివాదాస్పద భూభాగంలో సైన్యాన్ని నిలిపినందుకు సుంకాన్ని విధిస్తేనే చైనా బలగాలు అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంది."

- ఆష్లే టెల్లిస్​

చైనా ఆలోచన అదే..

అయితే ఇక్కడో సమస్య ఉందని టెల్లిస్​ తెలిపారు. ఒకవేళ భారత్​ చర్యలకు దిగితే ఇప్పటికే కీలక ప్రాంతాల్లో సైనికులను మోహరించిన చైనా ఘర్షణకు దిగుతుందని.. ఇది మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందని ​ వివరించారు.

1990 నుంచి చైనా గస్తీ విధానాన్ని పరిశీలిస్తే అక్సాయిచిన్​ ప్రాంతాన్ని మొత్తం నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఆ దేశం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని టెల్లిస్​ పేర్కొన్నారు. 1950 నుంచి ఈ ప్రాంతాన్ని తమదని చైనా వాదిస్తోంది. అయితే ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నుంచి నెమ్మదిగా చిన్న చిన్న ప్రాంతాలను తన భూభాగంలో చైనా కలుపుకొంటోందని తెలిపారు.

మ్యాపుల విషయంలోనూ..

ఈ సందర్భంలో వాస్తవిక భూభాగాన్ని కచ్చితంగా నిర్ధరించలేమని టెల్లిస్ పేర్కొన్నారు. ఇరువైపులా సరిహద్దుకు సంబంధించి స్పష్టంగా వివరించే పటాలు లేకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. చైనా ఆక్రమిస్తుంటే భారత్​ ప్రతిఘటించటం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు.

"సరిహద్దులకు సంబంధించి కచ్చితమైన మ్యాపుల రూపకల్పనకు భారత్​ పట్టుబడుతోంది. అయితే దురాలోచనతోనే చైనా దీనిపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకవేళ భారత్​ ప్రతిపాదించిన పటానికి ఆమోదం తెలిపితే.. భవిష్యత్తులో తనవిగా చెప్పుకొంటున్న భూభాగాలపై చైనా మాట్లాడలేదు. ఒకప్పుడు ఈ భూభాగాలు తమ అధీనంలోనే ఉన్నాయని చెప్పుకోలేదు. ఇది చైనాకు ఇష్టం లేదు."

- ఆష్లే టెల్లిస్​

ఇదీ చూడండి:సరిహద్దు వివాదంపై భారత్​- చైనా జనరల్​ల భేటీ

ABOUT THE AUTHOR

...view details