టిబెట్ సరిహద్దులోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్.. అటు నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువగా వస్తోంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా(85) వారసుడి ఎంపిక విషయమై చైనా శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
వ్యూహాత్మక అడుగులు
'1951 నుంచీ టిబెట్.. దాని విమోచనం, అభివృద్ధి.. శ్రేయస్సు' అంటూ దీనికి పేరు కూడా పెట్టారు. హిమాలయ ప్రాంతంలోని నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్ కీలకం కావటంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరిట చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాలక కమ్యూనిస్టు పార్టీ సూచనల మేరకు.. పేదరికంతో అవస్థలు పడుతున్న టిబెట్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి పనులకు ఏటా నిధుల కేటాయింపులు పెంచుకొంటూ వెళతామని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 2012లో జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక చైనా సరిహద్దుల అభివృద్ధి, కొత్త గ్రామాల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టారు. విస్తృతంగా హైవేల నిర్మాణం చేపట్టి, మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు.