సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్లో పలు నిబంధనల నుంచి రాజకీయ నేతలకు మినహాయింపు ఇచ్చే వివాదాస్పద పాలసీకి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్వయంగా ఈ పాలసీకి (గతంలో) దన్నుగా ఉండటం గమనార్హం.
ఏమిటి ఈ పాలసీ?
రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు సహజంగానే అభ్యంతరంగా ఉన్నా.. వాటిని ప్రసారం చేయదగ్గ సమాచారంగా గుర్తించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. దీనితో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ వాటిని ప్రసారం చేసేందుకు ఈ పాలసీ అనుమతినిస్తుంది.
అయితే ఈ పాలసీ ఉన్నప్పటికీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ఈ ఏడాది జనవరి 6 నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది ఫేస్బుక్. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఖాతాను ఏం చేయాలి అనే విషయంపై మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ వివాదం నేపథ్యంలోనే రాజకీయ నాయకులకు వివాదాస్పద వ్యాఖ్యల నుంచి రక్షణనిచ్చే పాలసీని తొలగించాలని ఫేస్బుక్ యోచిస్తున్నట్లు.. అమెరికాకు చెందిన దిగ్గజ వార్తా సంస్థలు వెర్జ్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ కథనాలు ప్రచురించాయి.
నిజానికి రాజకీయ నాయకులకు మినహాయింపునిచ్చే ఈ పాలసీ 2016 నుంచే అమలులో ఉంది. అయితే 2019లో ఫేస్బుక్ అంతర్జాతీయ వ్యవహారాలు, కమ్యూనికేషన్ విభాగ ఉపాధ్యక్షుడు నిక్ క్లెగ్గ్.. రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలను 'ప్రసారానికి యోగ్యమైన వార్త'గానే చూడాలని ప్రకటించడం వల్ల దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:Green Card: ఆ పరిమితి తొలగింపునకు బిల్లు