భారత్తో సరిహద్దు వివాదాలకు తెరలేపుతున్న చైనాపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్ సహా పొరుగు దేశాలతో 'డ్రాగన్' కవ్వింపు చర్యలకు దిగుతోందని.. బలవంతపు సైనిక, పారామిలిటరీ ఆందోళనకు తెరతీస్తోందని స్పష్టం చేసింది. ఈ మేరకు 'వైట్ హౌజ్' గురువారం ఓ అధికారిక నివేదిక విడుదల చేసింది. సరిహద్దుల్లో చైనా దురుసు వైఖరి ప్రదర్శిస్తోందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఒకరు వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ నివేదిక వెలువడడం గమనార్హం.
దక్షిణ చైనా సముద్రం, యెల్లో సీ, తైవాన్ జలసంధి, భారత్-చైనా సరిహద్దు విషయంలో చైనా చెబుతున్న మాటలకు.. చేతలకు పొంతన లేదని నివేదిక అభిప్రాయపడింది. తరచూ పొరుగుదేశాలతో కవ్వింపు చర్యలకు దిగుతూ దురుసు వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడింది. చైనా ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ అక్కడి 'చైనీస్ కమ్యూనిస్టు పార్టీ'(సీసీపీ) బెదిరింపులు, దురుసుతనాన్ని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించింది. తమ ప్రయోజనాలను, వ్యూహాత్మక లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్న వారందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేసింది.
అసమంజస విధానాల ద్వారా ప్రపంచ సమాచార సాంకేతికత వ్యవస్థను చైనా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందని నివేదిక అభిప్రాయపడింది. 'నేషనల్ సైబర్ సెక్యూరిటీ చట్టం' ద్వారా సమాచార స్థానికీకరణను తప్పనిసరి చేసినట్లు గుర్తుచేసింది. దీంతో ప్రపంచ దేశాల సమాచారాన్ని సీసీపీ తన గుప్పిట్లో ఉంచుకునేందుకు యత్నిస్తోందని కుండబద్దలు కొట్టింది.