అమెరికా 46 వ అధ్యక్షుడిగా.. జో బైడెన్ బుధవారం ప్రమాణస్వీకారం చేసిన తరువాత జాతి ఐక్యతా ప్రసంగం చేయనున్నారు. కరోనా మహమ్మారి సహా ఆర్థిక సంక్షోభ తరుణంలో.. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరంపై జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. ఈ మేరకు బైడెన్ సలహాదారులు తెలిపారు.
అమెరికా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్.. జోబైడెన్తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో బైడెన్ ప్రసంగం ఉంటుందని ఆయన సలహాదారులు చెప్పారు.
జో బైడెన్ ప్రసంగ రచయితగా ఇండియన్ అమెరికన్ వినయ్ రెడ్డి ఉన్నారు. 2013 నుంచి 2017 మధ్య ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా.. వినయ్ రెడ్డినే ఆయన ప్రసంగ రచయితగా ఉన్నారు. అయితే ఒక భారతీయ అమెరికన్.. అమెరికా అధ్యక్షుడికి ప్రసంగాన్ని రచించడం ఇదే మొదటిసారి.
డెలావేర్లో బైడెన్ భావోద్వేగం..
డెలావేర్లోని తన సొంతూరు నుంచి ప్రమాణ స్వీకారం కోసం.. ప్రైవేట్ విమానంలో వాషింగ్టన్ డీసీకి బయలుదేరారు బైడెన్. అంతకుముందు అక్కడి ప్రజలనుద్దేశించి బైడెన్ ప్రసంగించారు. డెలావేర్ రాష్ట్ర పౌరుడిని అయనందుకు తాను ఎప్పుడూ గర్వంగా భావిస్తానని చెప్పారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి గురై.. కన్నీరు కార్చారు.
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా.. డెలావేర్ రాష్ట్రానికి కుమారుడిగా ఉంటానని తెలిపారు. తాను చనిపోయినప్పుడూ తన హృదయంలో డెలావరే రాసి ఉంటుందన్నారు. వాషింగ్టన్కు తమ తదుపరి ప్రయాణం ఇక్కడి నుంచి మెుదలవుతోందన్నారు.