Hyderabad Pub Case: బంజారాహిల్స్ పరిధిలోని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ లభ్యమైన కేసులో నిందితులు అభిషేక్, అనిల్ మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అనిల్, అభిషేక్లను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాలుగు రోజుల కస్టడీలో ఠాణాకు తీసుకువచ్చి విచారించారు. ఏసీపీ స్థాయి అధికారి సమక్షంలో కస్టడీ విచారణ కొనసాగతోంది. వారిద్దరి కాల్ డేటాపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు... సుమారు 4 గంటల పాటు ఇద్దరినీ విడివిడిగా విచారించారు. పబ్కు హజరైన కష్టమర్ల వివరాలపై అభిషేక్ను ప్రశ్నించారు.
వారం ముందుగానే డ్రగ్స్: మరోవైపు పబ్ భాగస్వాములు, అగ్రిమెంట్లపై కూడా అభిషేక్ను ప్రశ్నించారు. పార్టీకి వారం కంటే ముందుగా డ్రగ్స్ పబ్కు వచ్చినట్లు పోలీసులు వద్ద ఉన్న ఆధారాలు వారి ముందు ఉంచి ప్రశ్నలు సంధించారు. అభిషేక్కు తెలిసే ఈ డ్రగ్స్ దందా సాగినట్లు అనుమానిస్తున్న పోలీసులు... గోవా, బెంగళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఈ కేసులో అనిల్, అభిషేక్లు ఇచ్చే వివారాలతో మరి కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కస్టడీ విచారణ ముగిసే వరకూ బంజారాహిల్స్ ఠాణాలోనే నిందితులను ఉంచనున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో అభిషేక్ భార్య లాయర్తో ఠాణాకు వచ్చారు.